చెత్త ఏరుకునే వ్యక్తికి.. రూ.9.8లక్షలు దొరికాయ్!, ట్విస్ట్ ఏంటంటే?
గంగానది పక్కనున్న చెట్ల పొదల్లో చెత్త ఏరుకుంటుండగా.. రద్దయిన రూ.500నోట్ల మూట ఒకటి అతని కంటపడింది.
ఉత్తరాఖండ్: నోట్ల రద్దు ఎఫెక్ట్ వల్ల.. దేశంలోని పలుచోట్ల రోడ్ల మీద, చెత్త కుప్పల పక్కన భారీ మొత్తంలో రద్దయిన నోట్లు దర్శనమివ్వడం వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ చెత్త ఏరుకునే వ్యక్తికి ఏకంగా రూ.9.80లక్షల దొరకడం ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ లోని రిషికేష్లో ఉత్తమ్ థారు అనే నేపాలి వ్యక్తి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో గంగానది పక్కనున్న చెట్ల పొదల్లో చెత్త ఏరుకుంటుండగా.. రద్దయిన రూ.500నోట్ల మూట ఒకటి అతని కంటపడింది.
మూట విప్పి చూడగా అందులో రూ.9.80లక్షలు విలువచేసే రద్దయిన నోట్లు ఉన్నట్టుగా తేలింది. అనంతరం దాన్ని పోలీసులకు అప్పగించాడు. ముని-ఖి-రేతి పోలీస్ స్టేషన్ లో పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఘటన వివరాలను స్టేషన్ ఇన్ఛార్జీ రవికుమార్ సాయిని వెల్లడించారు.