కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి రేసులో మాజీ ఒలింపియన్?
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో ఓ అనూహ్య పేరు తెరమీదికి వచ్చింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న అనంతరం- దానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానంటూ రాజీవ్ గాంధీ ప్రకటించారు. రాజీనామా లేఖను సైతం యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీకి అందజేశారు. ఆయన రాజీనామా చేయడం సరికాదంటూ దేశవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అత్యున్నత విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం దీన్ని ఏకగ్రీవంగా తోసిపుచ్చింది.
అయినప్పటికీ- రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కొన్నాళ్ల పాటు అధ్యక్ష పదవికి దూరంగా ఉంటానంటూ స్పష్టం చేస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటే ప్రత్యామ్నాయం ఏమిటనే అంశంపై కాంగ్రెస్ నేతల్లో కొంతకాలంగా చర్చ సాగుతోంది. ఆయనకు స్థానంలో పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై ఎవరికీ పెద్దగా స్పష్టత లేదు.
ఈ పరిస్థితుల్లో ఓ అనూహ్యమైన పేరు తెరమీదికి వచ్చింది. హాకీ మాజీ ఆటగాడు అస్లం షేర్ ఖాన్ను కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించవచ్చంటూ నేషనల్ మీడియా చెబుతోంది. రెండేళ్ల పాటు మాత్రమే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉంటారని, అస్లం ఖాన్ పేరును స్వయంగా రాహుల్ గాంధే ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అస్లం ఖాన్ పేరును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పరిశీలిస్తుందా? లేదా అనేది తెలియరావాల్సి ఉంది.
అస్లం ఖాన్ మాజీ ఒలింపియన్. 1975లో మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా సాగిన ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో పాల్గొన్న భారత జట్టు సభ్యుడు. 1972లో మ్యూనిచ్లో ఏర్పాటైన ఒలింపిక్లో ఆడిన హాకీ జట్టులోనూ ఆయన సభ్యుడే. క్రీడారంగానికి గుడ్బై చెప్పిన తరువాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్రమంత్రిగా పనిచేశారు. కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చారు. అనంతరం- క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పేరును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకుంటుందినేది వేచి చూడాల్సిందే.
అస్లం ఖాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులు కావడం అంటూ జరిగితే- అదో చరిత్రే. ఇప్పటిదాకా మైనారిటీ నేతలు ఎవరూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేయలేదు. సీతారాం కేసరి వంటి వేళ్ల మీద లెక్క పెట్ట గల నాయకులు గాంధీ కుటుంబేతర నేతలు ఈ బాధ్యతల్లో కొనసాగారే తప్ప మైనారిటీలకు ఆ అవకాశం దక్కలేదు. అస్లం ఖాన్తో ఆ లోటు భర్తీ చేయవచ్చని చెబుతున్నారు.