కేరళపై ఫుల్ఫోకస్: పరుగుల రాణి పీటీ ఉష బీజేపీలోకి! పలువురు సినీ నటులు కూడా
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు మరికొందరు ప్రముఖులను కూడా కన్నేసింది. వారు కూడా ఇందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం.
బీజేపీకి మద్దతుగా పీటీ ఉష..
ఒలింపిక్ పతక విజేత, మాజీ అథ్లెట్, పరుగుల రాణిగా పిలిచే పీటీ ఉష.. గత కొంతకాలంగా బీజేపీకి, కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేగాక, ఇటీవల కొందరు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రైతుల మేలు కోసమే కేంద్రం నూతన చట్టాలు తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ఉష వ్యాఖ్యానించారు.
బీజేపీలో చేరనున్న పీటీ ఉష
ఈ నేపథ్యంలోనే ఉష బీజేపీలోకి చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కాగా, రాష్ట్ర బీజేపీ నేతలు ఆమెను తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. ఇందుకు ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. త్వరలోనే ఆమె కూడా కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కే సురేంద్రన్ విజయ్ యాత్రలో ఆమె పాల్గొని పార్టీలో చేరే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉన్ని ముకుందన్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా..
శ్రీధరన్, పీటీ ఉషతోపాటు ప్రముఖ మాలీవుడ్ నటుడు ఉన్న ముకుందన్ కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భవిష్యత్తులో పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఉన్ని ముకుందన్ తెలపడం గమనార్హం. మరో సినీనటీమణులు అనుశ్రీ, మల్లికా సుకుమరన్ లను కూడా బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కేరళపై కన్నేసిన బీజేపీ..
కేరళలో వామపక్షం అధికారంలో ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పలు భారీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి మద్దతుగా కేరళలో ఇటీవల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ యధేచ్ఛగా సాగుతున్నా.. ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కనబడటం లేదంటూ మండిపడ్డారు. ఈసారి బీజేపీకి పట్టం కట్టాలని కేరళ ప్రజలకు పిలుపునిచ్చారు.