పీఎంవోను లాగొద్దు.. మనీష్కు స్పీకర్ ఝలక్.. ఎలక్ట్రోరల్ బాం(డ్స్)బ్తో దద్దరిల్లిన లోక్సభ
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు లోక్సభ ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ అంశం సభను కుదిపేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కీమ్ చట్టవిరుద్ధమని, మనీ లాండరింగ్, అవినీతికి చట్టబద్ధతను కల్పించేలా ఉందని కాంగ్రెస్ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ..
ఆర్బీఐ అంక్షలకు విరుద్ధంగా
ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కీమ్పై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఈ వ్యవహారాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకొంటున్నాను. ఎలక్ట్రోరల్ బాండ్స్ను ఆర్బీఐ వ్యతిరేకించిందనే విషయాన్ని ఆర్టీఐ 2018లో స్పష్టమైంది. ఎన్నికల కమిషన్, ఆర్బీఐ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ఈ బాండ్లను జారీ చేసింది అని మనీష్ తివారీ విమర్శించారు.
పీఎంవో ఆర్డర్పై మనీష్ తివారీ
ఎలక్ట్రోరల్ బాండ్స్ జారీ చేసి అవినీతిని కప్పిపుచ్చుకొనే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 2017కు ముందు ఎన్నికల్లో సంపన్నవర్గాలను కట్టడి చేసేందుకు ఓ విధానం ఉండేది. చట్ట వ్యతిరేకంగా ఉండే ఎలక్ట్రోరల్ బాండ్స్ను కట్టడి చేసేందుకు 2018 ఏప్రిల్ 11వ తేదీన పీఎంవో స్పందించిందనే విషయాన్ని మనీష్ తివారీ గుర్తు చేశారు. అయితే ఈ వ్యవహారంలో పీఎంవోను లాగవద్దని మనీష్ తివారీని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. అంతేకాకుండా తదుపరి సభ్యుడికి అవకాశం ఇస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో గందరగోళం నెలకొన్నది.
స్పీకర్ అభ్యంతరంతో కాంగ్రెస్ దూకుడు
మనీష్ తివారీ ప్రసంగాన్ని మధ్యలో స్పీకర్ అడ్డుకోవడంతో కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు. భారీ ఎత్తున్న నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారు. ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరీ ఒకరిపై మరొకరు వాగ్భాణాలు సంధించుకొన్నారు. ఈ క్రమంలో సభా మర్యాదను కాపాడాలని సభ్యులకు స్పీకర్ సూచించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు సభా కార్యక్రమాలను బహిష్కరిస్తూ వాకౌట్ చేశారు.
అవి రాజకీయ ముడుపుల బాండ్లు
అంతకుముందు లోక్సభలో ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కీమ్లో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ స్కీమ్ రాజకీయ ముడుపుల పథకం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కీమ్ అంటే.. రాజకీయపార్టీకి విరాళం ఇచ్చే వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఎవరైనా బాండ్లను కొనుగోలు చేసి డబ్బును పార్టీ ఖాతాలో జమచేస్తే వారి వివరాలను రహస్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం.