విమానం టేకాఫ్ తీసుకున్న 16 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్
ముంబై: ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాల గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. భారీ వర్షాలతో పలు విమానాలు రన్వేపై నుంచి పక్కకు మళ్లిన ఘటనలు ముంబై, కేరళ , సూరత్ విమానాశ్రయాల్లో చూశాం. ఇక మరికొన్ని విమానాలు గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఇంజిన్ ఫెయిల్యూర్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒమన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకుంది.
ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కు టేకాఫ్ తీసుకున్న ఒమన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే తిరిగి ముంబై విమానాశ్రయంకు చేరుకుంది. గాల్లోకి ఎగిరిన 16 నిమిషాలకే పూర్తి స్థాయి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అడిగారు పైలట్లు. వెంటనే అనుమతించడంతో ఓమన్ ఎయిర్లైన్స్ విమానం WY204 బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో 205 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు.
మరోవైపు భారీ వర్షాలతో చాలా వరకు విమానాలను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని విమానాలను దారి మళ్లించగా ఇంకొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సోమవారం నుంచే ముంబైలోని ప్రధాన రన్వేను అధికారులు మూసివేశారు. రన్వేపై నుంచి స్పైస్ జెట్ విమానం పక్కకు మరలిన సంగతి తెలిసిందే. రెండో రన్వేను వినియోగిస్తున్నప్పటికీ విమానాలు మాత్రం చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.గురువారం నుంచి ప్రధాన రన్వే వినియోగంలోకి వస్తుందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.