ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు.. విభజనకు మూడు రోజుల ముందు ఏం జరిగిందంటే..?
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్తో పంచుకున్నారు.
Recommended Video
నేను పోటీచేయను
జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినందున తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ఈ విషయంపై తాను పూర్తి క్లారిటీతో ఉన్నట్లు జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్తో తన అభిప్రాయాన్ని తెలిపారు ఒమర్ అబ్దుల్లా. జమ్మూకశ్మీర్ భూమిలో ఉన్న అసెంబ్లీకి తాను నాయకుడిగా ఆరేళ్లు పనిచేసినట్లు చెప్పిన ఒమర్.. ఇప్పుడు ఆ పరిస్థితిని ఊహించలేనని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
72 గంటల ముందు ఏం జరిగింది...
ఇక జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు కంటే మూడు రోజుల ముందు ప్రధాని మోడీ తమతో సమావేశం నిర్వహించారని అయితే జమ్మూకశ్మీర్ను విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తున్నామన్న విషయం చెప్పలేదని ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. ఇది కుట్రగానే భావించాలని ఆయన చెప్పారు. ఇక పార్లమెంటులో విభజనకు సంబంధించి బిల్లు పెడతారనగా తమను అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ఆర్టికల్ 370కి తూట్లు
ఇక జమ్మూకశ్మీర్పై ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదని చెప్పిన ఒమర్ అబ్దుల్లా ఆర్టికల్ 370 రద్దు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైందని, దేశాభివృద్ధిలో పాలుపంచుకుందని చెప్పిన ఒమర్ అబ్దుల్లా... ఆర్టికల్ 370 రద్దు చేయడం ప్రభుత్వానికి పేరుతెచ్చి పెట్టి ఉండొచ్చు కానీ ఆ ఆర్టికల్కు ఉన్న ప్రాధాన్యతను తుడిచిపెట్టాలనుకోవడం దారుణమని అన్నారు.
జమ్మూకశ్మీర్ను విభజిస్తారనే వార్తలు షికారు
నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్ను విడగొడతారనే వార్తలు షికారు చేశాయని చెప్పిన ఒమర్ అబ్దుల్లా.. ఇందుకోసం బీజేపీకి వచ్చిన మెజార్టీ సీట్లను పావుగా వాడుకుని పార్లమెంటులో బిల్లును తీసుకొస్తుందనే విషయం ముందుగానే తెలుసునని చెప్పారు. ఇక ఒక్కసారిగా కేంద్రబలగాలు జమ్మూకశ్మీర్లో మోహరించగానే రాష్ట్రం ఒక భయానక వాతావరణంలోకి వెళ్లిపోయిందని గుర్తు చేశారు ఒమర్ అబ్దుల్లా.
ఆర్టికల్ 370 రద్దును సమర్థించుకునేందుకు చాలామంది చాలా రకాల కారణాలు చెప్పారు కానీ ఎవరూ ఆర్టికల్ యొక్క ప్రాథమిక ప్రాముఖ్యతను ఎవరూ గుర్తించలేదని చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలో ఉగ్రవాదం, పెట్టుబడులు, మానవవృద్ధి సూచికలను ఇలాంటివేమీ పట్టించుకోలేదని జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఒమర్ అబ్దుల్లా చెప్పారు.