OMG : ఒమర్ అబ్దుల్లా ఇలా అయిపోయాడా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్
గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన ఓ నవ్వు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఫోటో. క్లీన్ షేవ్తో, చురుకైన చూపులతో స్మార్ట్గా కనిపించే ఒమర్ అబ్దుల్లా.. ఇలా గుర్తుపట్టరాకుండా మారిపోయాడా..? అని చాలామంది నెటిజెన్స్ ఆయన ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే అభిప్రాయపడ్డారు. ఆయన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె.. ఒమర్ అబ్దుల్లాను తాను గుర్తుపట్టలేకపోయానని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడం దురదృష్టకరమని, దీనికి ఎప్పుడు తెరపడుతుందోనని అభిప్రాయపడ్డారు.
I could not recognize Omar in this picture. Am feeling sad. Unfortunate that this is happening in our democratic country. When will this end ? pic.twitter.com/lbO0PxnhWn
— Mamata Banerjee (@MamataOfficial) January 25, 2020
గతేడాది అగస్టు 5న జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానిక నాయకులను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. అందులో మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీ సహా వందలాది మంది నేతలు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. నిర్బంధంలో ఉన్నప్పటి నుంచి ఈ నేతలందరికీ బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఒమర్ అబ్దుల్లా ఫోటో ఎప్పుడు తీసిందనే దానిపై స్పష్టత లేదు. అయితే నిర్బంధం నుంచి విముక్తి కలిగేంతవరకు అబ్దుల్లా గడ్డం తీయబోయరని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆయన 50వ వడిలోకి అడుగుపెట్టబోతున్నారు. కానీ నిర్బంధం కారణంగా ఆయన ముఖంలో వృద్దాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆర్నెళ్లుగా ఆయన నిర్బంధంలో ఉన్నప్పటికీ.. ఆ ఫోటోని చూస్తుంటే 30 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నట్టు అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.