మైండ్గేమ్ అంటూనే పీడీపీకి సై అన్న ఒమర్, బీజేపీ ఆశలు అంతేనా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ (44) ఎవరికీ రాకపోవడంతో ఊగిసలాడ కొనసాగుతోంది.
గవర్నర్ లేఖ
పీడీపీ, బీజేపీలకు రాష్ట్ర గవర్నర్ వోహ్రా శుక్రవారం నాడు లేఖ రాశారు. ప్రభుతవం ఏర్పాటు పైన చర్చలకు ఆయన వారిని ఆహ్వానించారు.
ఒమర్ అబ్దుల్లా ట్విస్ట్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం మాట్లాడుతూ.. తాము బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు. అయితే, కోరితే పీడీపీకి మద్దతిస్తామని చెప్పారు. అయితే, తాము పీడీపీకి లేఖ రాసినట్లుగా ఆ పార్టీ చెప్పడం సరికాదన్నారు.
తాము ఇప్పటి వరకు ఆ పార్టీకి అధికారికంగా మద్దతు విషయమై లేఖ రాయలేదని చెప్పారు. పీడీపీ ఈ విషయంలో మైండ్ గేమ్ ఆడుతోందని ధ్వజమెత్తారు. పీడీపీ తమ మద్దతు కోసం ముందుకు వస్తే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు, తన పైన గెలుపొందిన ఉత్సాహంలో గాల్లోకి కాల్పులు జరిపిన పీడీపీ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని ఒమర్ డిమాండ్ చేశారు. ఆయన పైన కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
బీజేపీ ఆశలు అడియాసలేనా..?
ఒమర్ అబ్దుల్లా పీడీపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలనుకుంటున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యేలా కనిపిస్తున్నాయి. పీడీపీకి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. పీడీపీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.