కాశ్మీర్లో 4 ఆప్షన్స్: రాజీనామా చేసి, వేచి చూస్తున్న ఒమర్!
శ్రీనగర్: 87 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కాశ్మీర్లో మేజిక్ ఫిగర్ 44. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పుడు నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ(25 సీట్లు), పీడీపీ (28 సీట్లు) కలవడం, రెండు పీడీపీ (28), కాంగ్రెస్ (12) జతకట్టడం.
అప్పుడు వారికి స్వతంత్ర అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. మూడు బీజేపీ (25), నేషనల్ కాంగ్రెస్ (15) జతకట్టడం. వీరు కలిసినా స్వతంత్ర సభ్యులు అవసరం. ఇలా కాదంటే.. మైనార్టీ ప్రభుత్వం ఏర్పడితే.. బీజేపీ లేదా ఇతర పార్టీలు బయటి నుండి మద్దతివ్వడం.
రాజీనామా చేసిన ఒమర్
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యనేత ఒమర్ అబ్దుల్లా బుధవారం రాజీనామా చేశారు. ఆయన గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత పీడీపీ, భారతీయ జనతా పార్టీల పైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందోనని తాము వేచి చూస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేల మద్దతుందంటున్న బీజేపీ
జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో తమకు ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అప్పుడు తమ మెజార్టీ (బీజేపీ గెలుచుకున్న 25, మద్దతిస్తామంటున్న ఆరుగురు) 31గా ఉందని బీజేపీ చెబుతోంది. తొలుత ఏడుగురు మద్దతు ఉన్నట్లుగా బీజేపీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తమకు 6గురు మద్దతు ఉందని చెబుతోంది.
జార్ఖంట్ సీఎం రేసులో వీరే..
జార్ఖండ్ ముఖ్యమంత్రి రేసులో నాన్ ట్రైబల్ రఘుబర్ దాస్ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు సరయురాయ్, నీలకంఠ్ మండా, బర్కుబార్ జాగ్రాయ్ తదితరులు రేసులో ఉన్నారు.