మాజీ సీఎం మాజీ భార్యను బలవంతంగా వెళ్లగొట్టారు!
న్యూఢిల్లీ: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాటల్ అబ్దుల్లా సోమవారం రాత్రి ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల కాపీతో జమ్ము కాశ్మీర్ ఎస్టేట్ అధికారి సోమవారం సాయంత్రం లుటెన్స్ జోన్లోని పాయల్ బంగళాకు వచ్చారు.
ఖాళీ సమయంలో సోమవారం రాత్రి అక్బర్ రోడ్ 7లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. లుట్యెన్స్ జోన్లో పాయల్ నివసిస్తున్న బంగ్లాను ఆమె రాత్రి ఖాళీ చేసి వెళ్లారు. ఈ బంగ్లా ఒమర్ అబ్దుల్లా గతంలో కేంద్ర మంత్రిగా పని చేసినప్పుడు కేటాయించారు.
అయితే ఇప్పుడు ఆ భవనంలో ఒమర్ నుంచి విడిపోయిన ఆయన భార్య ఉంటున్నారు. బంగ్లాను ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశించడంతో జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి చెందిన ఎస్టేట్ అధికారులు బంగ్లా వద్దకు వచ్చారు.
అయితే అక్కడ కాపలాగా ఉన్న ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్లడానికి అంగీకరించలేదు. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించి తమ వెంట భద్రతా సిబ్బందిని తెచ్చుకున్నారు. అయినప్పటికీ గేటు తెరవలేదు. దీంతో ఏసీపీని సంప్రదించారు.
అక్కడ ఉన్న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో పాయల్ బంగ్లాలో లేరు. అనంతరం ఇంటికి వచ్చిన పాయల్ మీడియాతో మాట్లాడకుండా లోపలికెళ్లారు. ఆ తర్వాత ఆమె లాయర్ బయటకు వచ్చి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పాయల్ వస్తువులు బయటకు విసిరేశారని, కనీసం సామాను సర్దుకునే సమయం ఇవ్వలేదన్నారు. రాత్రి పాయల్ రెండు కార్లలో తన సామానుతో బంగ్లా నుంచి వెళ్లిపోయారు. అధికారులు వెంటనే భవనానికి కొత్త నేమ్ ప్లేట్ తగిలించారు.