చదువు చెబుతున్నారా లేదా : అక్కడ పదవ తరగతి ఫలితాల్లో 63 స్కూళ్లు ఖాతా తెరవలేదు
గుజరాత్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో చాలా స్కూళ్లు కనీసం ఖాతా తెరవలేదు. అంటే ఆ స్కూళ్లలోని విద్యార్థులకు ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. మంగళవారం అక్కడ సెకండరీ స్కూలు సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో విద్యార్థులకు మార్కులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
గుజరాత్ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 66.97శాతంగా ఉంది. గతేడాది ఇది 67.5 శాతంగా ఉన్నింది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల22వేల 823 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరవగా... 5 లక్షల 51వేల 23 విద్యార్థులు పాస్ అయినట్లు బోర్డు ఛైర్మెన్ ఏజే షా తెలిపారు. ఈ ఫలితాల్లో 63 స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదని ఆయన అన్నారు. మరోవైపు 366 స్కూళ్లలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని షా తెలిపారు. ఇక పదవ తరగతి పరీక్షలు రెండవసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు రాసిన విద్యార్థుల్లో 17.23 శాతం మంది మాత్రమే పాస్ అయినట్లు చెప్పారు. ఈ పరీక్షలో బాలికలదే పైచేయిగా ఉందని షా చెప్పారు.
ఇక అత్యధిక ఉత్తీర్ణత శాతం చూస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో 88.11శాతం పాస్ పర్సెంటేజ్ వచ్చింది. ఆ తర్వాత 72.66 శాతంతో హిందీ మీడియం స్కూళ్లు నిలిచాయి. ఇక గుజరాత్ మీడియ స్కూళ్లు 64.58శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచాయి. దక్షిణ గుజరాత్లోని సూరత్ జిల్లా 79.63శాతంతో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాగా నిలువగా... గిరిజన జిల్లా అయిన చోటా ఉదేపూర్ 46.38శాతంతో చివరి స్థానంలో నిలిచింది.