ఓ మై గాడ్ : గోవు పాలల్లో బంగారం ఉందట..లాజిక్ చెప్పిన బీజేపీ నేత,ఆడుకున్న నెటిజెన్లు
బురుద్వాన్ : గోవు పాలల్లో బంగారం ఉంటుందట అందుకే ఆ పాలు పసుపు రంగులో ఉంటాయట. అది కూడా ఒక్క భారతదేశంలో ఉన్న గోవుల్లో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుందట. ఇది మేము చెబుతున్నది కాదు... సాక్షాత్తు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. బురద్వాన్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ నెటిజెన్లు మాత్రం ఓ ఆటాడేసుకున్నారు.
భారతదేశంలో పుట్టి పెరిగిన గోవులు ఇచ్చే పాలల్లో బంగారం ఉంటుందని వెస్ట్ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. అంతేకాదు తన వ్యాఖ్యలను సమర్థించుకునేలా ఓ ఫిలాసఫీ కూడా సెలవిచ్చారు. భారతదేశంలో పుట్టి పెరిగిన గోవులకు వెనక వైపున మూపురం ఉంటుందని అదే విదేశాల్లో పుట్టి పెరిగిన గోవుల్లో ఇది కనిపించదని చెప్పారు. ఈ మూపురంలోనే స్వర్ణనరి అనేది దాగి ఉంటుందని చెప్పారు. ఎప్పుడైతే సూర్యకిరణాలు ఈ మూపురం మీద పడుతాయో ఆ సమయంలో ఇవి బంగారంగా రూపాంతంరం చెందుతుందని దిలీప్ ఘోష్ చెప్పారు. దీంతో బంగారం రంగు లేదా పసుపురంగు లోకి పాలు మారుతాయని చెప్పారు. అంతేకాదు ఈ పాలు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కేవలం ఈ పాలు తాగి మనిషి జీవించగలడని ఢంకా బజాయించి మరీ చెప్పారు. ఇక ఈ పాలు తాగితే ఆహారం తీసుకోనవసరం లేదని సెలవిచ్చారు.
అయితే దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై నెటిజెన్లు చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. దిలీప్ ఘోష్ చెబుతున్న లాజిక్ అర్థం కాక తలలు పట్టుకున్నవారు లేకపోలేదు. ఎలాగైనా ఈ లాజిక్ను చేధించాలని కొందరు ట్విటర్లో పోస్టు చేశారు. ఇక కొందరైతే దిలీప్ ఘోష్ చెప్పిన లాజిక్తో ఆటాడేసుకున్నారు. ఇంతకీ దిలీప్ ఘోష్కు సైన్స్ పాఠాలు చెప్పిన టీచర్ ఎవరని కొందరు నెటిజెన్లు ప్రశ్నించగా.. మరికొందరు ఈ బంగారు పాల నుంచి తయారయ్యే వెన్న తిని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరీ అంత బరువెక్కారేమో అని చమత్కరించారు. మరికొందరు భారత్లో పుట్టని గోవులు దైవంతో సమానం కాదా అని ప్రశ్నించారు. మరొక నెటిజెన్ మాత్రం పాలు ఎందకు పసుపు రంగులోకి మారుతాయో చెప్పారు. అందులో బేటాకరోటిన్ అనే పిగ్మెంట్ ఉండటం వల్ల పాలు పసుపు రంగులోకి మారుతాయి తప్ప అదేదో బంగారం ఉండటం వల్ల కాదని చెప్పారు.
ఈ వ్యాఖ్యలతో అయ్యగారు సరిపెట్టలేదు. ఇంకాస్త ముందుకు వెళ్లి భారత్లో గోవులను చంపడం, బీఫ్ తినడం అనేది క్షమించరాని నేరమని.. అలా చేసిన వారిని సంఘవిద్రోహక శక్తులుగా పరిగణిస్తామన్నారు.