ఓ మైగాడ్: దౌత్యాధికారి హోదాలో ఈ మేడం ఇంటి అద్దె ఎంత చెల్లిస్తుందో తెలుసా..?
న్యూఢిల్లీ: అధికారం ఉంది కదా అని ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రభుత్వాధికారులపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న భారతదౌత్యాధికారులపై వారి ఖర్చులపై కేంద్ర ప్రభుత్వం నజర్ వేసింది. ఆస్ట్రియాలో భారత దౌత్యాధికారిగా పనిచేస్తున్న రేణు పాల్ అక్కడ నివాసం ఉండేందుకు ఓ అపార్ట్మెంటును అద్దెకు తీసుకున్నారు.
ఇందుకోసం నెలకు రూ.15 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. అద్దె చెల్లిస్తున్నారంటే ఈమె సొంత డబ్బులు కాదు. ప్రభుత్వంకు బిల్లులు పెట్టి నెలకు రూ. 15 లక్షలు చెల్లిస్తున్నారు. ఇంత మొత్తంలో ఇంటి అద్దె చెల్లిస్తుండటంతో ప్రభుత్వానికి అనుమానం వచ్చి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో అసలు బాగోతం బయటపడింది.
ఆస్ట్రియా అంబాసిడర్గా
1988వ బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ రేణు పాల్. వచ్చే నెలలోనే ఆస్ట్రియా అంబాసిడర్గా తన పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు విదేశీ వ్యవహారాల శాఖ చేపట్టిన విచారణలో ఈమె ప్రభుత్వం సొమ్మును భారీగా వృథా చేసినట్లు వెల్లడైంది. అంతేకాదు తప్పుడు బిల్లులు సృష్టించి కొన్ని కోట్ల రూపాయలు కాజేసిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు వ్యాట్ రీఫండ్స్ కోసం తప్పుడు అనుమతులతో కూడిన పత్రాలను సమర్పించిందని విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.
ఆస్ట్రియాలో భారత దౌత్యాధికారి హోదాలో
ఇక రేణుపాల్ పై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేసేందుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నేతృత్వంలో ఓ బృందం ఈ ఏడాది సెప్టెంబర్లో వియన్నాకు చేరుకుంది. అక్కడ విచారణ చేయడం ప్రారంభించింది. ఇక విచారణ పూర్తి కాగానే సీవీసీకి ఓ నివేదికను సైతం సబ్మిట్ చేసింది. ఆస్ట్రియాలో భారత దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్న రేణుపాల్ నిబంధనలను ఉల్లంఘించిందని రిపోర్టులో సీవీసీ పేర్కొంది.
దౌత్యాధికారిగా తనకు ఆర్థిక అంశాలపై
అంతేకాదు ప్రభుత్వ నిధులను సైతం తప్పుదోవ పట్టించిందని నివేదికలో అధికారులు పొందుపర్చారు. ఇక ఈ నివేదిక ప్రభుత్వం చెంతకు వెళ్లడంతో ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. డిసెంబర్ 9వ తేదీన హెడ్క్వార్టర్స్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఒక దౌత్యాధికారిగా తనకు ఆర్థిక అంశాలపై ఉన్న హక్కులను తొలగించింది. అంటే ఎలాంటి ఆర్థికపరమైన విషయాల్లో ఆమె జోక్యం చేసుకోరాదని సూచించింది ప్రభుత్వం. ఇక ప్రభుత్వ ఆదేశాలు అందుకున్న రేణు పాల్ ఆదివారం భారత్కు చేరుకున్నట్లు సమాచారం.