ఇంట్రెస్టింగ్: ప్రేయసి కోసం 1300 కి.మీ ప్రయాణించిన పులి..చివరకు దొరికిందిలా..!
సాధారణంగా ఒక వ్యక్తి ఎవరినైనా ప్రేమిస్తే అవతల వ్యక్తితో జీవితం పంచుకునేందుకు ఎంతకాలమైనా వేచిచూస్తాడు. కొన్ని సందర్భాల్లో వ్యక్తి కనిపించకుండా పోతే వారికోసం వెతికి వెతికి చివరకు పెళ్లి కూడా చేసుకోకుండానే అలానే జీవితం గడిపిన వాళ్ళను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక పులి తన ప్రేయసి అయిన మరో పులికోసం వెతకడం ప్రారంభించింది. పులి ఏంటి.. ప్రేమ ఏంటి..ప్రేయసి కోసం వెతకడమేంటి అనేగా మీ అనుమానం. అవును ఇది మేము చెబుతున్నది కాదు. అధికారులే చెబుతున్నారు. అసలు ఈ కథ ఏంటో ఓ సారి చూసేద్దాం.
తిపేశ్వర్ రిజర్వ్లో జన్మించిన పులి
అప్పుడప్పుడే వయసుకు వస్తున్న ఓ పులి తన ప్రేయసి అయిన మరో పులి కోసం దాదాపు 1300 కిలోమీటర్లు మేరా నడిచింది. దాని కోసం వెతుక్కుంటూ వెళ్లి ఆరు జిల్లాలను దాటేసింది. ఇది మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంతేకాదు ఇది మన తెలంగాణలో కూడా అడుగుపెట్టింది. చివరకు బుల్ధానా జిల్లాలోని ధ్యాన్గంగా శాంక్చురీకి చేరుకుంది. ఇక్కడే అధికారులు దీన్ని గమనించారు. యవత్మాల్ జిల్లాలోని తిపేశ్వర్ టైగర్ రిజర్వ్లో జన్మించిన TWLS-T1-C1 ట్యాగ్ ఉన్న ఈ పులి ఆరు జిల్లాలు దాటుకుంటూ చివరకు కొత్త ప్రాంతానికి చేరుకునేందుకు 150 రోజులు పట్టిందని అధికారులు తెలిపారు.
జూన్ 2019 నుంచి అదృశ్యమైన పులి
ఈ ఏడాది జూన్ నుంచి ఈ పులి కనిపించలేదని పెంచ్ టైగర్ రిజర్వర్ ఫీల్డ్ డైరెక్టర్ రవికిరణ్ తెలిపారు. అంటే ఈ పులి జూన్లోనే తిపేశ్వర్ శాంక్ఛురీనీ వీడినట్లు తెలుస్తోందని చెప్పారు. T1-C1 అనే ఈ పులి TWLS-T1 అనే పులికి 2016లో జన్మించిందని చెప్పారు. ఈ పులికి C2, C3 అనే మరో రెండు పులులు కూడా జన్మించాయని అధికారి వెల్లడించారు. ఈ మూడు పులులు 2019లో తల్లి నుంచి వేరు అయ్యాయని వెల్లడించారు. ఇక అప్పటి నుంచి ఈ పులలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ పులులు ఒక్కసారి తల్లి నుంచి వేరయ్యాయంటే తమ సొంత గూటిలో ఉండేందుకు ఇష్టపడతాయని ఈ క్రమంలోనే కొత్త ప్రాంతాల్లో సంచరిస్తాయని చెప్పారు. తిపేశ్వర్ టైగర్ రిజర్వ్ను వీడి C1 మరియు C3 పులులు తెలంగాణ సరిహద్దులోని పంధరఖవడా డివిజన్లో సంచరించినట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్ అడవుల్లో కూడా సంచారం
ఇక జూలై మాసం మధ్యలో C3 అనే ఈ పులి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా వరకు వెళ్లినట్లు అధికారులు చెప్పారు. అయితే అక్కడ ఉండకుండా తిరిగి 10 రోజుల్లోనే తిరిగి తిపేశ్వర్ రిజర్వ్కు చేరుకుందని ఫీల్డ్ ఆఫీసర్ రవికిరణ్ తెలిపారు. ఇక మన స్టోరీలోని C1 టైగర్ మాత్రం అంబాడీ ఘాట్ కిన్వత్ అటవీప్రాంతం నుంచి ఆదిలాబాద్లోకి ప్రవేశించిందని అధికారి రవికిరణ్ వివరించారు. ఆగష్టు సెప్టెంబర్ నెలల మధ్య ఆదిలాబాదులోనే ఈ పులి సమయం గడిపినట్లు చెప్పారు.
ఆరు జిల్లాలను కవర్ చేసిన పులి
ఆ తర్వాత పాయిన్గంగా శాంక్చురీలోకి ఎంటర్ అయ్యిందని అక్కడే కొంతకాలం సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్లో పుసాద్ డివిజన్, ఈసాపూర్ శాంక్చురీలకు చేరుకున్నట్లు చెప్పారు. ఇక అక్టోబర్ చివరివారంలో మరఠ్వాడా ప్రాంతంలోని హింగోలీ జిల్లాకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హింగోలీ జిల్లానుంచి వషీం జిల్లాకు ప్రవేశించి అక్కడ నుంచి చివరిగా బుల్దానాలోని అకోలా డివిజన్కు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ద్యాన్గంగా శాంక్చురీకి చేరుకుంది.
మనుషులపై దాడి మాత్రం చేయలేదు
శాటిలైల్ లొకేషన్ చూస్తే ఈ C1 అనే ఈ పులి ద్యాన్గంగా శాంక్చురీకి చేరిందని చెప్పారు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎంఎస్ రెడ్డి. ఈ అడవిలో చాలా జంతువులు ఉంటాయని చెప్పారు. ఇక మేల్ఘాట్ ల్యాండ్స్కేప్కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ పులి ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏమిటంటే... తన ప్రేయసి కోసం వెతుకుతూ వెళ్లిన ఈ పులి ఆరు జిల్లాలు దాటింది. పొలాల్లో తిరిగింది. కానీ ఎక్కడా మనుషులపై దాడి చేయలేదని ఎంఎస్ రెడ్డి చెప్పారు. అది బతికేందుకు మాత్రం కొన్ని జంతువులపై దాడి చేసిందని చెప్పారు.
హింగోలీ జిల్లాలో మాత్రం పులిని పసిగట్టిన గ్రామస్తులు వెంటనే అధికారులు దృష్టికి తీసుకొచ్చారని రవికిరణ్ చెప్పారు. అయితే పులులు కూడా తమకు ఇష్టమైన ఇతర పులుల కోసం కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళతాయనేది నగ్న సత్యం అని అయితే ఇది ఎవరూ నమ్మరని రవికిరణ్ చెప్పారు.