ఓమిక్రాన్ ప్రమాకరం కావొచ్చు, 30కిపైగా మ్యూటేషన్లు: ఎయిమ్స్ చీఫ్ గులేరియా కీలక అంశాల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మ్యూటేషన్లపై ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా కీలక విషయాలను వెల్లడించారు. ఓమిక్రాన్ లోని స్పైక్ ప్రొటీన్లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అందుకే దీనిక రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు.
ఈ మ్యూటేషన్లు ప్రమాదకరం కావొచ్చని, ఇదే జరిగితే మాత్రం టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు డాక్టర్ గులేరియా. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు.
స్పైక్ ప్రోటీన్ ను లక్ష్యంగా చేసుకునే చాలా వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయన్నారు. స్పైక్ ప్రోటీన్లలో వైరస్ ను గుర్తించినప్పుడు వాటిని ఎదుర్కొంటే యాంటీబాడీలను వృద్ధి చేస్తాయని, దీంతో మానవ కణంలోకి వైరస్ ప్రవేశించకుండా అవి అడ్డుకుంటాయని తెలిపారు. అయితే, తాజా వేరియంట్ లో స్పైక్ ప్రోటిన్లోనే దాదాపు 30కిపైగా ఉత్పరివర్తనాలు కనిపించాయని చెప్పారు.
స్పైక్ ప్రోటీన్ భాగం ఎక్కువ ఉత్పరివర్తనాలు సంభవిస్తే వ్యాక్సిన్ సమర్థత తగ్గిపోవడానికి దారితీస్తుందని డాక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఇలాంటి సందర్భంలో భారత్ లో వినియోగిస్తున్న వ్యాక్సిన్లతోపాటు అన్ని టీకాల సమర్థతను క్షుణ్ణంగా పనిశీలించి అంచనా వేయాల్సి అవసరం ఉందన్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యానికి సంబంధించి వెలువడే సమాచారంపైనే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఆధారపడి ఉంటాయని ఆయన తెలిపారు.
ఓమిక్రాన్ వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు మరింతగా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, కరోనా నిబందనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో వెలుగుచూస్తున్న ఓమిక్రాన్ వేరియంట్.. ఇప్పటి వరకైతే మనదేశంలో వెలుగుచూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్ కు సంబంధించి భారత్ లోని కోవిడ్ జీనోమ్ కన్సార్టియం ఇన్సాకోగ్(ఐఎన్ఎస్ఏసీవోజీ) ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తోందని తెలిపింది. ఇప్పటికే ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం స్పష్టం చేసింది.
కాగా, కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పరిస్థితులపై సమీక్షించాకే అంతర్జాతీయ ప్రయాణాలను పునరిద్దరించాలని నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమనా సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఓమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
విమాన సర్వీసుల పునరుద్ధరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించాకే సర్వీసుల పునరుద్ధరణ తేదీలపై నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.