Omicron Virus: ఆ పేరు ఎలా వచ్చింది-భారత్కు ముప్పు ఉందా: డెల్టా వర్సెస్ ఒమిక్రాన్..!!
కరోనా వైరస్ పీడ విరుగుడు అయ్యిందనుకునేలోపే ఓమిక్రాన్ పేరుతో కొత్త వైరస్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తరహా వైరస్ కూడా కరోనాకు సంబంధించినదే అని ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్కు సంబంధించి పూర్తి వివరాలను శాస్త్రవేత్తలు డీటెయిల్డ్గా వివరించారు. ఆ పేరు ఎలా వచ్చింది, ఇది ఎంత ప్రమాదకరం, డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ప్రాణనష్టం చేకూర్చుతుందా అనే అంశాలను చాలా స్పష్టంగా వివరించారు. అవేంటో తెలుసుకుందాం.
Recommended Video
ఒమిక్రాన్ అని పేరు ఎలా వచ్చింది
కరోనా వేరియంట్లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్. ఈ పేరును ఫైలోజెనిటిక్ అసైన్మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్బ్రేక్ సంస్థ నిర్ణయించింది. ఇక ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా కరోనా వైరస్ పలు స్ట్రెయిన్స్లోకి మారినప్పుడు దానికి ఒక పేరును పెట్టే సంప్రదాయం ప్రపంచ ఆరోగ్య సంస్థ పాటించడం మొదలుపెట్టింది. అయితే కొత్త వేరియంట్ B.1.1.529లో రెండు గ్రీకు పదాలను స్కిప్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇందులో Nu అనే పదం ఉంది.
అయితే దీన్ని ప్రజలు న్యూ అని తప్పుగా అర్థం చేసుకుంటారని దీన్ని తొలగించింది. ఆ తర్వాత Xi అనే పదం ఉంది. అయితే ఇది ఓ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదం కనుక దీన్ని కూడా తొలగించి ఆ తర్వాత వచ్చే ఒమిక్రాన్ అనే పదంను ఈ కొత్త వేరియంట్కు పెట్టారు. గ్రీకు అక్షరాలు 24 ఉన్నాయి. ఆల్ఫాతో ప్రారంభమై ఒమెగాతో ముగుస్తాయి. ఒమిక్రాన్ అనేది జాబితాలో 15వ అక్షరం. ఒకవేళ దీని తర్వాత మరో కొత్త రకం వైరస్ వస్తే దానిపేరు పై అని నామకరణం చేస్తారు. ఎందుకంటే ఒమిక్రాన్ తర్వాత గ్రీకు అక్షరమాలలో తదుపరి అక్షరం పై ఉంది.
డెల్టా వేరియంట్ వర్సెస్ ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 50 వరకు మ్యూటేషన్స్ ఉన్నాయనే విషయం తెలుసు. ఇందులో 32 స్పైక్ ప్రొటీన్లుగాను మరో 10 అత్యధిక ప్రమాదం తీసుకురాగల ఇతర మ్యూటేషన్స్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో H655Y, N679K ,P681Hలాంటి మ్యూటేషన్లు అత్యంత ప్రమాదకరంగాను అత్యంత వేగంగాను వ్యాపించగలవని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక R203K , G204R అనే ఈ రెండు మ్యూటేషన్లు కూడా ఇన్ఫెక్షన్ను తారా స్థాయికి తీసుకెళుతాయని శాస్త్రవేత్తలు వివరించారు. వీటిలో ఉండే స్పైక్ ప్రొటీన్ రోగనిరోధక శక్తిని చంపేస్తుంది. అంతేకాదు యాంటీబాడీలను కూడా నాశనం చేస్తుంది.
అదే సమయంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది ఐసొలేషన్లో ఉన్నప్పుడు గుర్తిస్తే దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దాన్ని గుర్తించేందుకు నాలుగు వారాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇక డెల్టా వేరియంట్ విషయానికొస్తే ఇప్పటి వరకు గుర్తించిన వైరస్లలో కెల్లా అత్యంత వేగంగా వ్యాపించే వైరస్ అని కచ్చితంగా చెప్పగలిగాం. కానీ ఒమిక్రాన్ పరిస్థితి అలా కచ్చితంగా చెప్పలేకపోతున్నాం అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఉదాహరణకు వ్యాక్సిన్ కవరేజ్ తక్కువగా ఉన్న దేశాల్లో ఒమిక్రాన్ ఆ జనాభాపై విరుచుకుపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏ ఏ సందర్భాల్లో ఒమిక్రాన్ ఎలా రియాక్ట్ అవుతుందో అనే అంశంపై పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఒమిక్రాన్ రిస్క్ ఎంతవరకు..?
ఒమిక్రాన్తో ఎంతమేరకు రిస్క్ ఉందనే విషయం పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో, వ్యాక్సిన్ తీసుకోనివారిలో ఈ పరిశోధనలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకుతుందన్న విషయం మరవరాదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని అలసత్వం ప్రదర్శించరాదని శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ల విషయానికొస్తే టీకాలు కొంత మేరకు ప్రభావం చూపుతాయని అయితే 100శాతం సురక్షితంగా ఉంటామన్న గ్యారెంటీ లేదని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలని చెబుతున్నారు.
భారత్కు ముప్పు ఉందా
ఒమిక్రాన్ ఒక్కసారి దేశంలోకి ప్రవేశించిందంటే ముప్పు కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది గుర్తించిన వెంటనే అత్యంత జాగ్రత్తతో డీల్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కంగారు పడకూడదని చెబుతున్నారు.గతంలో బీటా (B.1.351) వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 100దేశాలకు పాకింది. కానీ పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. అదే మాదిరిగా అమెరికాలో లాంబ్డా (C.1.37) పుట్టింది కానీ ఇతర దేశాల్లో దీని ప్రభావం కనిపించలేదు. ఒమిక్రాన్ కూడా అలాంటిదేనా అనేది స్టడీ చేయాల్సి ఉందన్నారు. ఇందుకు 3 నుంచి 4 వారాల సమయం పడుతుందన్నారు.
ఇక భారత్ విషయానికొస్తే, చాలామంది టీకాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని దీంతో ముప్పు కొని తెచ్చుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే సమయంలోనే వైరస్ విజృంభించే అవకాశం ఉంది. ఇక వెంటనే అన్ని రాష్ట్రప్రభుత్వాలు టీకాలు ఇవ్వడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక ఆరోగ్యవ్యవస్థను ప్రభుత్వాలు వేగవంతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ భారత్లో ఎలా ప్రభావం చూపుతుందో అనేది అంచనా వేయలేమన్నారు. అయితే తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎవరికి వారు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటిస్తే దీన్ని నిలువరించగలుగుతామని చెబుతున్నారు.
ప్రయాణ ఆంక్షలు విధిస్తే సరిపోతుందా..
ప్రయాణ ఆంక్షలు విధించేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వైరస్ లక్షణాలు గుర్తించేలోపే అప్పటికే ఇది వ్యాప్తి చెంది ఉంటుంది. ఇతర దేశాలకు కూడా పాకి ఉండొచ్చు. అయితే ఏ దేశంలో అయితే వైరస్ తొలుత గుర్తించబడిందో ఆ దేశం నుంచి మన దేశంలోకి వచ్చేవారి పట్ల ఆంక్షలు విధించడం వల్ల ఒరిగేది ఏమీ లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఆ దేశం నుంచి మిగతా దేశాలకు వెళ్లి అక్కడి నుంచి భారత్కు వచ్చేవారుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ప్రజలను భయాందోళనకు గురిచేసే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. ప్రయాణాలపై నిషేధం విధించడం పట్ల ఇతర దేశాలు అప్రమత్తమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే విమాన ప్రయాణాలపై నిషేధం విధించకుండా వాటిని కొనసాగిస్తూనే ముందస్తు జాగ్రత్త చర్యలు మరింత కఠినతరం చేయాలని సూచిస్తున్నారు.
తక్షణ కర్తవ్యం ఏంటి..?
ఇక గత రెండేళ్లలో వైరస్ పట్ల దేశంలో చాలావరకు అవగాహన వచ్చింది. ఇక కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అంటే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం, వ్యాక్సినేషన్ చేయించుకోవడం, జనసమర్దత ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, భౌతిక దూరం పాటించడం, వెంటిలేషన్ ఉండే గదుల్లో ఉండటం వంటివి పాటించాలని వైద్యులు చెబుతున్నారు. అయితే రోజువారీ కేసుల సంఖ్య భారత్లో తగ్గుతోంది.
అదే సమయంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు భారత్లో గుర్తించలేదు. రాష్ట్రప్రభుత్వాలు ముందుగానే ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. జన్యుపరమైన పరీక్షలు వేగవంతంగా నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థల నుంచి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని చర్యలు తీసుకుంటే ఈ కొత్త వైరస్కు అడ్డుకట్టవేయగలమని చెబుతున్నారు.