పొట్టి దుస్తుల వల్లే..: మహిళలపై మరో స్వామీజీ సంచలన కామెంట్స్
బురఖాలో ఉన్న స్త్రీలు సురక్షితంగా ఉంటున్నారని, పొట్టి స్కర్టులు వేసుకుంటున్నవారే ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారని ఓంజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: బెంగుళూరు కీచకపర్వంపై ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అబూ అజ్మీ నోరు పారేసుకోగా.. ఇప్పుడు మరో బాబా కూడా ఆయనకు జత కలిశారు. అజ్మీ లాగే ఈయన కూడా తప్పంతా అమ్మాయిలదే అన్న తరహాలో కామెంట్ చేసి ఇప్పటికే రగులుతున్న వివాదాన్ని మరింత వివాదం చేసే ప్రయత్నం చేశారు.
హిందూ మహాసభ అధ్యక్షుడైన స్వామీ ఓంజీ మహారాజ్ బెంగుళూరు కీచకపర్వంపై వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. ఓ టీవి చానెల్ ప్రైమ్ టైమ్ లో 'షో' లోని ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన ఆయన.. మహిళలు ధరిస్తున్న దుస్తుల వల్లే వారి మీద లైంగిక దాడులు జరుగుతున్నట్టుగా కామెంట్ చేశారు.
బురఖాలో ఉన్న స్త్రీలు సురక్షితంగా ఉంటున్నారని, పొట్టి స్కర్టులు వేసుకుంటున్నవారే ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారని ఓంజీ అన్నారు. అమ్మాయిలు నిండైన వస్త్రధారణలో ఉండాలని.. అలా ఒంటినిండా బట్టలు కప్పుకోకపోతే, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా లైంగిక దాడులు జరుగుతాయని చెప్పారు.
ఓవైపు సెలబ్రిటీలు, ప్రముఖులంతా ఈ ఘటనపై మండిపడుతున్న తరుణంలో ఓంజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత రగిల్చేదిగా తయారైంది.