మోడీ కొత్త నినాదం ఇదే: ఆ వెబ్సైట్లోను అందరూ ఫాలో అవ్వండి: ఇందిరాగాంధీని స్మరిద్దాం
న్యూఢిల్లీ: దేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్కు సంబంధించిన ఓ కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఆయనలో సెన్సాఫ్ హ్యూమర్ ఉందనే విషయం చాలామందికి తెలియదని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం సర్దార్ పటేల్లోని నవ్వించే తత్వాన్ని ప్రశంసించే వారని అన్నారు. అత్యంత కఠిన పరిస్థితులను సర్దార్ పటేల్ చిరునవ్వులతో ఎదుర్కొన్నారని, వాటిని అధిగమించారనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని మోడీ అన్నారు.
Recommended Video
మన్ కీ బాత్లో మోడీ
సరిహద్దుల్లో కఠినతర వాతావరణ పరిస్థితుల్లో, కుటుంబానికి దూరంగా, ప్రాణాలను ఎదురొడ్డి పహారా కాస్తున్నారని మోడీ అన్నారు. వారికి కృతజ్ఙతలు తెలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలని చెప్పారు. ఆదివారం ఆయన తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన మహర్షి వాల్మీకీ జయంతిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అదేరోజు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని దేశం కోల్పోయిందని, ఆమె చేసిన సేవలను స్మరించుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు.
శక్తిపీఠాలు.. దేశాన్ని జోడించే సూత్రాలు..
ఆదిశంకరాచార్యులు స్థాపించిన శక్తిపీఠాల గురించి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు భారత్ను ఏక సూత్రంతో కట్టేశాయని అన్నారు. భక్తి అనే కనిపించని దారం.. ప్రతి పౌరుడిని ఏకం చేస్తోందని చెప్పారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్..రాజ్యంగ రచనతో దేశ ప్రజలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయుల రక్తంలో ఉందని చెప్పారు. ఏదో ఒక రూపంలో ఇది భారతీయుల మధ్య ప్రస్ఫూటిస్తుందని చెప్పుకొచ్చారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్
ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ నినాదాన్ని భారతీయులు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు. దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఏక్ భారత్ వెబ్సైట్ను ప్రతి ఒక్కరూ చూడాలని మోడీ సూచించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలను అందులో పొందుపర్చారని చెప్పారు. ఒక పదాన్ని ఏ ప్రాంతీయ భాషలో ఎలా పలుకుతారు? దాని అర్థమేంటీ? అనే విషయ పరిజ్ఙానానికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.
కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా పెన్సిల్ తయారీ హబ్గా మారిందని మోడీ తెలిపారు. 90 శాతం పెన్సిల్ తయారీ ముడి పదార్థాలు అక్కడి నుంచి అందుతున్నాయని తెలిపారు. ఇదివరకు ఈ ముడి వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని, ఇప్పుడు పుల్వామా నుంచి 90 శాతం అక్కడే తయారవుతున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనమి అన్నారు. పెన్సిల్ విలేజ్ గుర్తింపు పొందిందని, దీనికి ప్రధాన కారకుడు మన్జూర్ భాయ్కు ఈ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు.