7న జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం..! అమరుల త్యాగాలు వృధా కాలేదన్న బీజేపి..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కట్టబట్టే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ, రాష్ట్రపతి సంతకం పెట్టిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. . 7వ తేదీ, అంటే బుధవారం నాడు జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ఆర్టికల్ రద్దుకు దారితీసిన పూర్వపరాలను, ప్రభుత్వం తీసుకోనున్న తదుపరి నిర్ణయాలపై ఆయన వెల్లడిస్తారని సమాచారం.
ఇదే సమయంలో బుధవారం నాడు అఖిలపక్ష భేటీకి కూడా ప్రధాని కార్యాలయం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 7వ తేదీ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారోన్న ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఉదయం రాజ్యసభలో అమిత్ షా ఆర్టికల్ 370రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
జమ్మూ కశ్మీర్కు సంబంధించి కేంద్రం ప్రకటనపై స్పందించిన బీజేపీ నేత రాంమాధవ్ ఇది అద్భుతమైన రోజని, ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాల పోరాటానికి ఇవాళ తెరపడిందని రాంమాధవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకాశ్మీర్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూ, కశ్మీర్, లద్ధాఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లద్ధాఖ్కు ఎలాంటి అసెంబ్లీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందని, అయితే జమ్ము కాశ్మీర్ రెండుగా విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇక ఢిల్లీలాగా ఉంటుందని, ముఖ్యమంత్రి ఉంటారని, అయితే గవర్నర్ ఉండరని, గవర్నర్ జనరల్ ఉంటారన్నారు.
కాగా భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జమ్ము కశ్మీర్కు సంబంధించి ఇవాళ ఉదయం రాజ్యసభలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్టికల్ 370, 35(ఏ) అధికరణలను రద్దు, రాష్ట్ర విభజన అంశాలను ఏకకాలంలో సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు.దీంతో జమ్ము కశ్మీర్లోనూ భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లైంది.