నీరవ్ మోడీ కుంభకోణం: పెదవి విప్పిన ప్రధాని నరేంద్ర మోడీ
Recommended Video
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకుల్లో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నీరవ్ మోడీ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఆయన తొలిసారి ఆ విషయంపై శుక్రవారం పెదవి విప్పారు.
ప్రజల నిధులను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం సహించబోదని ఆయన హెచ్చరించారు. ఆర్థిక అక్రమాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎకనమిక్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు.
ఆ విధమైన అక్రమాలను నివారించడంలో ఉన్నత స్థాయి యాజమాన్యం, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ కీలకమైన పాత్ర పోషించాలని ఆయన అన్నారు. వివిధ ఆర్థిక సంస్థలపై ప్రజలు నిబంధనలను, నియమాలను పాటించాల్సిన బాధ్యతను పెట్టారని ఆయన అన్నారు.
పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు అంకిత భావంతో పనిచేయాలని ఆయన కోరారు. ప్రజా ధనాన్ని అక్రమంగా పోగు చేసుకునే విధానాన్ని సహించబోమని, అదే ప్రాథమికమైన మంత్రమని అన్నారు.