రైలు మీద నుంచి వెళ్లినా, చిన్న గాయం కాకుండా బయటపడిన చిన్నారి (వీడియో)
మధుర: ఉత్తర ప్రదేశ్లోని మధుర రైల్వే స్టేషన్లో ఒళ్లు జలదరించే సంఘటన చోటు చేసుకుంది. ఏడాది వయసున్న ఓ చిన్నారి రైల్వే స్టేషన్లో తల్లి చేతుల నుంచి ప్లాట్ ఫాం పక్కనున్న పట్టాల పక్కన పడిపోయింది. అంతలోనే అక్కడి నుంచి రైలు వెళ్లింది. కానీ చిన్నారి ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది.
ఈ అద్భుతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధుర రైల్వే స్టేషన్లో ఓ జంట ప్లాట్ ఫాం పైన రైలు కోసం వేచి చూస్తూ నిలబడింది. రైలు అనౌన్స్మెంట్ విని వారు పరుగెత్తుకు వచ్చారు. ఆ తొందరలో పాప పట్టాల పక్కన, ప్లాట్ ఫాంకు మధ్య ఉన్న గ్యాప్లో పడింది.
#WATCH: One-year-old girl escapes unhurt after a train runs over her at Mathura Railway station. pic.twitter.com/a3lleLhliE
— ANI UP (@ANINewsUP) November 20, 2018
అంతలోనే రైలు ముందుకు కదిలింది. పాప కిందపడటంతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. పాపకు ఏమయిందోనని ఆందోళన చెందారు. రైలు పూర్తిగా ముందుకు వెళ్లిన తర్వాత చూస్తే పాప సురక్షితంగా ఉంది. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.