మొన్న కుమారుడు.. నేడు తండ్రి: మాజీ ప్రధానమంత్రి కారును తనిఖీ చేసిన ఎన్నికల సిబ్బంది!
తుమకూరు: విధి నిర్వహణలో ఎన్నికల అధికారులు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారనే ఉదంతానికి నిదర్శనం ఇది. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రయాణిస్తున్న కారును నిలిపివేసి, క్షుణ్నంగా పరిశీలించిన ఎన్నికల సిబ్బంది, తాజాగా ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవేగౌడ వాహనంలో సోదాలు చేశారు. ఆ సమయంలో దేవేగౌడ కారులోనే ఉన్నారు. కర్ణాటకలోని తుమకూరు లోక్ సభ పరిధిలోని కుణిగల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
మోడీ వెంట బ్లాక్ బాక్స్! అనుమానాలెన్నో? ఈసీకి ఫిర్యాదు!
జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడైన దేవేగౌడ.. తుమకూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈ ఉదయం ఆయన తుమకూరులోని పార్టీ కార్యాలయంలో పదాధికారులతో సమావేశం అయ్యారు. పోలింగ్ కు ఎక్కువ సమయం లేనందున.. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. వారికి మార్గదర్శకాలు జారీ చేశారు.
అనంతరం కారులో గూళూరుకు బయలుదేరారు. మధ్యాహ్నం గూళూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దేవేగౌడ ప్రసంగించాల్సి ఉంది. మార్గమధ్యలో కుణిగల్ పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఆయన కారును నిలిపివేశారు. ఆ సమయంలో దేవేగౌడ ముందు వరుస సీట్లో కూర్చుని ఉన్నారు. దేవేగౌడను చూడగానే.. సిబ్బంది సెల్యూట్ చేశారు. అనంతరం- కారును తనిఖీ చేయడానికి సహకరించాలని కోరారు. దీనితో దేవేగౌడ.. తనకేమీ అభ్యంతరం లేదని బదులిచ్చారు. దీనితో వారు కారు మొత్తం తనిఖీ చేసి, పంపించి వేశారు.
గతంలో కుమారస్వామి కారు తనిఖీ..
ఇదివరకు ఎన్నికల అధికారులు దేవేగౌడ కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కారును తనిఖీ చేసిన విషయం తెలిసిందే. హాసన-చెన్నరాయ పట్టణ జాతీయ రహదారిపై ఉన్న హిరిసేవ గ్రామం వద్ద ఈ నెల 3వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హాసన జిల్లాకు వెళ్లారు. అక్కడి నుంచి శివమొగ్గకు వెళ్లడానికి జాతీయ రహదారిపై వెళ్తుండగా.. హిరిసేవ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు ముఖ్యమంత్రి కాన్వాయ్ ను నిలిపివేసి, తనిఖీ చేశారు.