ఫస్ట్ పోస్టింగ్: లంచం తీసుకుని అడ్డంగా దొరికిన యువ ఐఏఎస్
పాట్నా: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువ ఐఏఎస్ ఆఫీసర్ బీహార్లో తన ఫస్ట్ పోస్టింగ్లోనే లంచం తీసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే... బీహార్కు చెందిన డాక్టర్ జితేంద్ర గుప్తా 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. శిక్షణ అనంతరం అతడు బీహార్ కేడర్నే ఎంచుకున్నాడు.
దీంతో తన ఫస్ట్ పోస్టింగ్లో భాగంగా బీహార్ ప్రభుత్వం అతడిని మొహానియా, కైమూర్ సబ్ డివిజనల్ అధికారిగా నియమించింది. విధుల్లో చేరిన గుప్తా మంగళవారం రాత్రి నాలుగు లారీలను ఆపాడు. అందులో రెండు లారీలు ఓవర్ లోడ్తో రాజస్థాన్ నుంచి జంషెడ్ పూర్కు వెళ్తున్నట్టు గుర్తించాడు.
ఇంకేముంది అవకాశం దొరికింది కదా? అని నడిరోడ్డుపైనే లారీ ఓవర్తో బేరసారాలకు దిగాడు. రూ.1.5 లక్షలిస్తే కానీ లారీలను వదిలేది లేదని వాహనాల యజమానికి తేల్చి చెప్పాడు. ఆ తర్వాత జరిగిన బేరసారాల్లో రూ.1.5 లక్షల నుంచి అతడు రూ.80 వేలకు తగ్గాడు.
ఈ మొత్తాన్ని తనకు ఇంటి వద్ద ఇవ్వాలని లారీ యజమానికి సూచించి లారీ పత్రాలను తీసుకుని గుప్తా ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్తో ఆ మొత్తాన్ని గుప్తాకు ఇంటి వద్ద అప్పజెప్పాడు. అనంతరం లారీ యజమాని ఈ ఉదంతం మొత్తాన్ని బీహార్ విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గుప్తా నిద్రలో ఉండగానే అర్ధరాత్రి ఆయన ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచిన గుప్తా... గుమ్మం ఎదుట విజిలెన్స్ అధికారులను చూసి షాక్ తిన్నాడు. గుప్తాను తోసుకుంటూ లోపలికి వెళ్లిన విజిలెన్స్ అధికారులు ఆయన ఇంటిలోని లారీ ఓనర్ ఇచ్చిన డబ్బుతో పాటు లారీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అతడిని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం గుప్తాను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రత్యేక విజిలెన్స్ కోర్టు గుప్తాకు 145 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ ఘటనతో బీహార్లో లంచం తీసుకుని దొరికిపోయిన మొట్టమొదటి ఐఏఎస్ అధికారిగా గుప్తా నిలిచారు.