4వ రోజుకు చేరిన అన్నా హజారే దీక్ష: 4కేజీలు తగ్గారు
న్యూఢిల్లీ: కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సోమవారంతో నాలుగో రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే నాలుగు కేజీల బరువు తగ్గారని.. రక్తపోటు సాధారణంగా ఉందని ఆయన సహాయకుడు దత్తా అవారీ చెప్పారు.
మార్చి 23 నుంచి ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో హజారే తన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన డిమాండ్లలో వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలన్న అంశం కూడా ఉంది. 2011 నుంచి అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నారు.
దీక్ష ప్రారంభం సందర్భంగా అన్నాహజారే .. తన మద్దతుదారులను ఢిల్లీకి రాకుండా రైళ్లను రద్దు చేశారని, హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారని కేంద్రంపై మండిపడ్డారు. తన చుట్టూ పోలీసు బలగాలను మోహరించారని, తనకు పోలీసుల రక్షణ అవసరం లేదంటూ చాలా సార్లు లేఖలు రాసినట్లు గుర్తు చేశారు.