పీఓకె ఏమైనా ఇండియా అబ్బా సొత్తా?: మాజీ సీఎం సంచలన కామెంట్స్
పీఓకె ఏమైనా ఇండియా అబ్బ సొత్తా? అంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కశ్మీర్ : వివాదంతో ముడిపడి ఉన్న పీఓకె అంశాన్ని తన వ్యాఖ్యలతో మరింత వివాదస్పదంగా మార్చేశారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. పీఓకెపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆయన.. పీఓకె ఏమైనా ఇండియా అబ్బ సొత్తా? అంటూ ఘాటు విమర్శలు చేశారు.
చీనాబ్ లోయలో జరిగిన ఓ కార్యక్రమంలో తనయుడితో పాటు పాల్గొన్న ఫరూక్ అబ్దుల్లా.. ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. "పీఓకే ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉంది. అదేమీ భారత వ్యక్తిగత ఆస్తి కాదు. తల్లిదండ్రులు, తాతముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి కాదు. ఈ విషయంలో పాకిస్థాన్ కూ వాటా ఉంది. పీఓకే ఇండియాలో భాగమని ఓ తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదు" అంటూ పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ఫరూక్.
పీఓకెలో పాక్కు వాటా ఉన్న విషయాన్ని భారత ప్రభుత్వం సైతం అంగీకరించిందంటూ ఫరూక్ వ్యాఖ్యానించారు. పాక్ తో చర్చలు జరపడం మినహా భారత్ కు మరో ప్రత్యామ్నాయం లేదని చర్చలతోనే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకుంటున్న అల్లర్లను అదుపులోకి తీసుకురావచ్చని సూచించారు. అంతకుముందు ఇదే అంశంపై స్పందిస్తూ.. భారత్-పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి యుద్దం సరైంది కాదని, చర్చలతోనే అది సాధ్యపడుతుందని ఫరూక్ పేర్కొన్న సంగతి తెలిసిందే.