మిగ్ ఫైటర్లపై ఎయిర్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!! అంత పాతవి కార్లు కూడా ఎవరు వాడరు!!
న్యూఢిల్లీ: ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా మిగ్ యుద్ధ విమానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత వాయుసేన 44ఏళ్ల క్రితం నాటి మిగ్-21 యుద్ధ విమానాలనే ఇంకా నడుపుతోందని.. అంత పాత కార్లను కూడా ఎవరూ వాడరని ఆయన అన్నారు.
పాకిస్థాన్ కూడా..
సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఇలాంటి మిగ్ యుద్ధ విమానాలను వాడటం మంచిది కాదేమోనని అభిప్రాయపడ్డారు. కాగా, పాకిస్థాన్ ప్రస్తుతం ఆధునాతనమైన ఎఫ్-16 జెట్ యుద్ధ విమానాలను వాడుతుండటం గమనార్హం.
విలాసవంతమైన కార్లైనా..
‘మేము ఇంకా 44ఏళ్ల క్రితం నాటి మిగ్-21 యుద్ధ విమానాల్లోనే ఎగురుతున్నాం. ఎంత విలాసవంతమైన కార్లైనా ఇంత పాతవయ్యే వరకు ఎవరూ వాడరు' అని మంగళవారం ఎయిర్ చీఫ్ ధనోవా అన్నారు. మోడర్నైజేషన్ అండ్ ఇండీజినైజేషన్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ఫోర్స్ సదస్సులో ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ సదస్సుకు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.
ఇదే చివరి సంవత్సరం
ఈ రష్యన్ బేసిక్ వర్షన్ ఫైటర్ జెట్లను ఈ ఏడాదిలోనే దశలవారీగా తొలగిస్తామని , తాను సెప్టెంబర్లో చివరిసారిగా ఈ విమానాన్ని నడుపుతానని అనుకుంటున్నట్లు ధనోవా తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఆధునాతన ఎఫ్-16 యుద్ధ విమానాలను వాడుతుంటే.. ఇంకా మన వాయుసేన మిగ్ యుద్ధ విమానాలనే వాడుతోందని అన్నారు.
44ఏళ్ల క్రితం నుంచి..
ఇలాంటి విమానాలను మన వాయుసేన ఇప్పటికీ వాడటం సరికాదని అన్నారు. భారత వాయుసేనలో కొత్త యుద్ధ విమానాలు చేరాల్సిన అవసరం ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా వ్యాఖ్యానించారు. కాగా, మిగ్-21 ఫైట్ జెట్లు భారత వాయుసేనలో 1973-74లో చేరాయి.