న్యూఇయర్ షాక్.. మందుతాగి పట్టుబడింది ఎంతమందో తెలుసా?
ఒకవైపు వేడుకలకు అనుమతిచ్చి.. ఇష్టమొచ్చినట్లు ఎంజాయ్ చెయ్యనిచ్చి.. మరోవైపు వేడుకల నుంచి వచ్చేవాళ్ల నోళ్లలో బ్రీత్ అనలైజర్లు పెట్టిమరీ బుక్ చేశారు పోలీసులు. కొత్త సంవత్సరం తొలిరోజే దేశవ్యాప్తంగా మందుబాబులకు పోలీసులు భారీ షాకిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి తర్వాత ఏకంగా వేలాదిమందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మందుతాగి పట్టుపడినవాళ్లలో మహిళలు కూడా ఉన్నారు.
తెలంగాణలో భారీగానే..
రాష్ట్ర పౌరులు న్యూ ఇయర్ వేడుకల్లో మునిగితేలుతోన్న వేళా.. చట్టం తన పని తాను చేసుకుపోయింది. డిసెంబర్ 31 సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్న పోలీసులు.. మొత్తం 3148 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 951 కేసులు, సైబరాబాద్ పరిధిలో 873, రాచకొండ రేంజ్ లో 281 కేసులు నమోదైనట్టు వివరించారు.
టాప్ లేపిన బెంగళూరు..
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రోడ్లమీద, పబ్బుల్లో, క్లబ్బుల్లో డ్యాన్సులు చేసి తిరిగొస్తున్నవాళ్లు ఎక్కువగా పట్టుపడింది బెంగళూరులోనే కావడం గమనార్హం. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచే తనిఖీలు మొదలు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. నవంబర్ ఎండ్ నాటికే సిలికాన్ సిటీలో మొత్తం 37,654 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సిటీ పోలీసులు వివరించారు. ఇక ముంబైలో మంగళవారం రాత్రి తాగి బండ్లు నడుపుతోన్న సుమారు వెయ్యిమందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
చలి ధాటికి ఉత్తరాదిలో ఉత్సాహం కరువు..
ఢిల్లీ, యూపీ, హర్యాణా, పంజాబ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతుండటంతో అక్కడి జనం న్యూఇయర్ వేడుకల్ని ఘనంగా చేసుకోలేకపోయారు. రోడ్లను పొగమంచు కప్పేయడంతో డిసెంబర్ 31 రాత్రి రాకపోకలు ఎక్కువగా చోటుచేసుకోలేదు. పైగా పోలీసుల వార్నింగ్ కూడా బాగానే పనిచేసింది. కోల్ కతాలో మాత్రం 188 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.