నోట్ల రద్దుకు రెండేళ్లు: అది మా లక్ష్యం కాదు.. అరుణ్ జైట్లీ ఏం చెప్పారంటే?
Recommended Video
న్యూఢిల్లీ: నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఈ రోజుకు (నవంబర్ 8) రెండేళ్లు. 2016 నవంబర్ 8న రాత్రిపూట నోట్ల రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. రూ.500, రూ.1000 నోట్లను మోడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు ప్రకటనకు రెండేళ్లయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
డబ్బును స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వం లక్ష్యం కాదనిచెప్పారు. ఒక పద్ధదిగల ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో నేటికి రెండేళ్లు పూర్తయిందని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న పలు నిర్ణయాల్లో ఇది చాలా కీలకమైనదని పేర్కొన్నారు.
తొలుత భారత్ వెలుపల దాగి ఉన్న నల్లధనాన్ని టార్గెట్ చేశామని, పన్నుల చెల్లింపుల ద్వారా ఈ డబ్బును దేశంలోకి తిరిగి తీసుకు రావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలా చెల్లించని వారిపై బ్లాక్ మనీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని, విదేశాల్లో భారతీయులకు ఉన్న బ్యాంకు అకౌంట్, ఆస్తుల వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరాయని చెప్పారు. చట్టాలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.
నోట్ల రద్దు తర్వాత పన్ను ఎగవేత తగ్గిందని చెప్పారు. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు తీసుకెళ్లేందుకు ఈ ప్రయత్నం అన్నారు. దీని వల్ల ఆదాయ పన్ను, పన్ను చెల్లింపులు పెరుగుతాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 20 శాతం పెరిగాయన్నారు. డైరెక్ట్ ట్యాక్స్ కూడా పెరిగిందన్నారు.
నోట్ల రద్దుపై విమర్శలు వచ్చాయని, కానీ డబ్బును జఫ్తు చేయడం లక్ష్యం కాదని చెప్పారు. ఓ పద్ధతి గల ఆర్థిక వ్యవస్థను తయారు చేయడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు.