నిజలింగప్ప, అంబేద్కర్లను మరిచి టిప్పు సుల్తాన్ జయంతులు: కాంగ్రెస్పై మోడీ ఫైర్
చిత్రదుర్గ: కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్, నిజలింగప్ప లాంటి నేతలు మర్చిపోయిందని ఓట్ల కోసం టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తూ కర్ణాటక ప్రజలను అవమానపరుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు.
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై ఆదివారం నాడు నిప్పులు చెరిగారు.చిత్రదుర్గలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మోడీ ప్రసంగించారు. చిత్రదుర్గ సాహస మహిళలకు ప్రసిద్ధి. అందులో ఒనాకే ఓబవ్వ అనే మహిళ గురించి ఆయన ప్రస్తావించారు. కానీ, కాంగ్రెస్ ఆమెను మర్చిపోయి టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు చేయడం బాధాకరమైన విషయమన్నారు మోడీ.
. కాంగ్రెస్ చిత్రదుర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. సుల్తానుల కాలంలో ధైర్యంగా పోరాడిన మహిళల గురించి మర్చిపోయి ఇక్కడి ప్రజలను అవమానిస్తోందని ఆయన ఆరోపించారు.. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి ఎస్.నిజలింగప్పను కూడా కాంగ్రెస్ గుర్తు పెట్టుకోలేదన్నారు.
ఎందుకంటే ఒకసారి ఆయన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సిద్ధాంతాలను పక్కన పెట్టారు. నెహ్రూ విధానాలను కర్ణాటకలో లింగప్ప అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్కు ఆయనంటే గిట్టదు. వారి దృష్టిలో నెహ్రూని ధిక్కరించడం పెద్ద నేరం. బీఆర్ అంబేడ్కర్ను కూడా కాంగ్రెస్ అవమానించిందని ఆయన ఆరోపించారు.. లేకపోతే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి ఎందుకు రాజకీయాల్లోకి రాలేదని ఆయన ప్రశ్నించారు.
ఇంత చేసిన కాంగ్రెస్కు కర్ణాటక ప్రజలు ఎన్నికల ఫలితాల రూపంలో బుద్ధి చెబుతారని మోడీ ధీమాను వ్యక్తం చేశారు.. ఈసారి సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్షంలో నిలుస్తారని ఆయన జోస్యం చెప్పారు.