అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
లోక్సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసింది. తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను దూషించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ గాంధీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.తనను ఎన్నిసార్లయినా దూషించవచ్చని అందుకు తానేమీ బాధపడనని కానీ తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు.
అంతకుముందు సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, రణదీప్ సూర్జేవాలాలు ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వంలో అవినీతి హిమాలయాల ఎత్తుకు చేరిందని విమర్శించారు. ఇక రాఫెల్ విషయానికొస్తే తమ వద్ద యుద్ధవిమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ వివరాలు ఉన్నాయని... 126 యుద్ధ విమానాల మెయింటెనెన్స్ కంటే 36 యుద్ధ విమానాల మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉందని దీన్ని బట్టే అవినీతి జరిగిందని తెలుస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. న్యాయశాఖ, రక్షణ శాఖ సలహామేరకే ప్రధాని నరేంద్ర మోడీ బ్యాంకు గ్యారెంటీలను మాఫీ చేశారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకే తను ప్రశ్నలు సంధించడం జరుగుతుందని వాటికి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వంలో రాఫెల్కు సంబంధించి ఎలాంటి ఫైళ్లు లేవని నిర్మలా సీతారామన్ చెప్పాలని ఆయన సవాలు విసిరారు. యుద్ధ విమానాల మెయింటెనెన్స్ గురించి ప్రభుత్వ అధికారులే అడ్డు చెప్పారని అలాంటప్పుడు ప్రధాని మోడీ ఒప్పందంపై ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. డిఫెన్స్ అధికారులు ఒప్పందంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దేని ఆధారంగా ఒప్పందంపై ముందుకు వెళుతున్నారో తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ అన్నారు.
రాహుల్ సంధించిన ప్రశ్నపై నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో రాఫెల్ ఒప్పందం ఆగిపోయిందని ఎదురు దాడికి దిగారు. ఎయిర్ ఫోర్స్ ఆ సమయంలో ధీనావస్థలో ఉందన్న సంగతి కాంగ్రెస్ మరిచిందని ఆమె ధ్వజమెత్తారు. ఒప్పందాన్ని మీరు ముగించలేకపోయారని ఆమె అన్నారు. అయితే దేశ భద్రత దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొంది. కాంగ్రెస్ సభలోనే కాదు బయట కూడా అసత్య ప్రచారాలు చేస్తోందని ఆమె మండిపడ్డారు.