ఎన్నికలవేళ తెరపైకి రాజీవ్ గాంధీ హత్య కేసు: ఆ రెండు పార్టీలు ఏమి చెబుతున్నాయి..?
అక్కడ ఈ రెండు పార్టీలు బద్దశత్రువులు. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తుంది పరిస్థితి. ఇక ఇది ఎన్నికల సీజన్ కావడంతో అధికార పార్టీ..ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే అంశాలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాయి. అయితే ఈ రెండు పార్టీలు కామన్గా ఒకే అంశాన్ని తమ తమ మేనిఫెస్టోలో చేర్చాయి. ఇంతకీ ఆ పార్టీలు ఏవి... తమ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు ఏమిటి..?
డబుల్ ధమాకా: ఈ తల్లీ కూతుళ్లు చరిత్ర సృష్టించారు...ఎందులో తెలుసా..?
నిందుతులను విడుదల చేస్తామంటున్న అన్నాడీఎంకే డీఎంకే
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. రెండు పార్టీలు బద్ధ శత్రువులే అయినప్పటికీ... ప్రభుత్వంలోకి రావాలి కాబట్టి ప్రజల సమస్యలపై ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే అన్ని వర్గాల వారిని ఆకట్టకునేలా తమ తమ మేనిఫెస్టోలను రూపొందించాయి అన్నాడీఎంకే పార్టీ, డీఎంకే పార్టీలు. అయితే రెండు పార్టీల మేనిఫెస్టోల్లో ఒక అంశం కామన్గా కనిపిస్తోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు నిందితులను విడుదల చేస్తామంటూ అధికార పక్షం ప్రతి పక్షం తమ మేనిఫెస్టోలో పొందుపర్చాయి.
రాజీవ్ గాంధీ హత్యకేసులో ఏడుగురు నిందితులు
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్ ఎల్టీటీఈకి చెందిన పలువురు మే 1991లో రాజీవ్ గాంధీని ఆత్మాహుతి బాంబుదాడితో హత్యచేశారు. ఎల్టీటీఈ చర్యలను అడ్డుకుని శ్రీలంకలో శాంతి నెలకొల్పేందుకు భారత్ నుంచి సైన్యాన్ని తరలించాలన్న నిర్ణయం చేసినందున ఆయన్ను ఎల్టీటీఈ మిలిటెంట్ సంస్థ హతమార్చించి. అయితే ఈ కేసులో మొత్తం 26 మందిని ప్రాథమికంగా నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత 19 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.ఇక మిగతా ఏడు మంది శ్రీహరన్ అలియాస్ మురుగన్, సుతేంతిరాజన్ అలియాస్ సంతాన్, పెరారివలన్ , జయకుమార్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, నళినిలను నిందితులుగా పేర్కొంటూ శిక్ష విధించింది కోర్టు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే 2014లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిందితులను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి వారి విడుదలపై స్టే తీసకొచ్చింది.
నలుగురు విదేశీయుల విడుదలకు సుప్రీంకు కేంద్రం
నిందితులుగా ఉన్నవారిలో నలుగురు విదేశీయులున్నారని అది అంతర్జాతీయంగా భారత్కు చెడ్డపేరు తీసుకొస్తుందని వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టును గతేడాది ఆగష్టులో కోరింది మోడీ ప్రభుత్వం.అయితే తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మెజార్టీ స్థానాలు తమకు వస్తే నిందితులను విడుదల చేస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో అంశాన్ని చేర్చాయి. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్నాయి.అంతేకాదు అదేరోజున 18 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
మేనిఫెస్టోలో కామన్గా కనిపించిన అంశాలు
ఇక రెండు పార్టీల మేనిఫెస్టోలో మరిన్ని అంశాలు చాలా కామన్గా కనిపించాయి. నీట్ పరీక్ష మినహాయింపు, ఎడ్యుకేషన్ లోన్ మాఫీ, విద్య అంశాన్ని రాష్ట్ర పరిధిలోకి తీసుకురావడం, ప్రైవేట్ రంగాల్లో సైతం రిజర్వేషన్ల వర్తింపు లాంటి అంశాలు అన్నాడీఎంకే, డీఎంకే మేనిఫెస్టోల్లో కనిపిస్తున్నాయి. అంతేకాదు పుదుచ్చేరిని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని రెండు పార్టీలు హామీలిచ్చాయి. డీఎంకే మేనిఫెస్టోపై మాట్లాడిన తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఛీఫ్ తమిళిసాయి కేవలం ఓట్ల కోసమే డీఎంకే అమలు కానీ హామీలు ఇస్తోందని విమర్శించారు. ఇవన్నీ తప్పుడు హామీలని బూటకపు హామీలని తమిళిసాయి మండిపడ్డారు.