'ఉత్తర ప్రదేశ్లో 74 లోకసభ స్థానాలు బీజేపీవే, 50 శాతం ఓట్లు కమలం పార్టీకే'
లక్నో: నిత్యం ఘర్షణపడే ఎస్పీ, బీఎస్పీలు వచ్చే లోకసభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం నిప్పులు చెరిగారు. ఆయన ఈస్టర్న్ యూపీలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి కడితే భయపడాల్సిన పని లేదని చెప్పారు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్లో బీజేపీకి 50 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు.
50 శాతం ఓట్లు రాబడతాం
అమిత్ షా శుక్రవారం యూపీలోని మహారాజ్గంజ్, జైన్పూర్ జిల్లాల్లో పర్యటించారు. బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని, మాట్లాడారు. బీఎస్పీ, ఎస్పీ కూటమిని చూసి బీజేపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనకు సగం ఓట్లు రాబట్టే శక్తి ఉందన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో తూర్పు యూపీలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అప్పట్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు కలిశాయన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఇక్కడ మాఫియా అనేదే లేకుండా పోయిందన్నారు.
74 స్థానాల్లో బీజేపీ విజయం
వచ్చే లోకసభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాజవంశాలకు మాత్రమే కాంగ్రెస్ ప్రాధాన్యతనిస్తుందని, బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యం ఆధారంగా నడుచుకుంటుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దేశ భద్రత మరింత పటిష్టమైందన్నారు. దేశంలోకి అక్రమంగా చొరబాడుతున్న వారిపై దృష్టి పెట్టిందన్నరు. అసోంలో ఎన్ఆర్సీ ముసాయిదాను విడుదల చేసిందని, దీంతో 40 లక్షల చొరబాటుదార్లు బయటపడ్డారన్నారు.
రామమందిరానికి కట్టుబడి ఉన్నాం
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అసోం నుంచి గుజరాత్ వరకు, యూపీ నుంచి ఉత్తరాఖండ్ వరకు అక్రమ చొరబాటుదార్లందరి పని పడుతుందని చెప్పారు. రామమందిర నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయంపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు తమ వైఖరిని చెప్పాలన్నారు.