అక్షయ తృతియ: ఒక్క రూపాయికి కూడా బంగారం! ఇంటి వద్దకే డెలివరీ!!
పేటీఎం మరో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘డిజిటల్ గోల్డ్’ ఆఫర్ ద్వారా తక్కువలో తక్కువగా రూపాయికి కూడా బంగారాన్ని కొనుక్కోవచ్చు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత అలీబాబాకు చెందిన పేటీఎం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. డిజిటల్ వ్యాలెట్ సర్వీసులు అందిస్తోన్న పేటీఎం ఇప్పుడు తన వినియోగదారులకు మరో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాబోయే అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని 'డిజిటల్ గోల్డ్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా తక్కువలో తక్కువగా రూపాయికి కూడా బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. రూ.20 వేల వరకు బంగారం కొనుగోళ్లకు ఎలాంటి కేవైసీ వివరాలను అందించాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇంటి వద్దకే బంగారు నాణేలు..
ఎంఎంటీసీ-పీఏఎంపీ సంయుక్తంగా పేటీఎం వేదికగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా పేటీఎం మొబైల్ వ్యాలెట్ వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారుల కోరిక మేరకు బంగారు నాణేలను ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వనున్నారు. మళ్లీ వీటిని ఆన్లైన్లో విక్రయించుకోవచ్చు.
సంప్రదాయానికే విలువ...
‘భారతీయులు బంగారాన్ని సంప్రదాయ పద్ధతిలో.. అదీ లెక్క ప్రకారం మాత్రమే కొనుగోలు చేస్తారు. మార్కెట్ అనుసంధానమైన ధరలను దృష్టిలో పెట్టుకోరు. ఆ సమయంలో స్వచ్ఛత, భద్రత, దాచుకోవడం తదితర అంశాలకు కొంత రుసుములు చెల్లిస్తుంటారు' అని ఎంఎంటీసీ-పీఏఎంఈ ఛైర్మన్ మెహదీ భరోద్కర్ అన్నారు.
ఐదేళ్ల పాటు భద్రంగా...
ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎంఎంటీసీ-పీఏఎంపీలోనూ సెక్యుర్ గా గోల్డ్ ను ఐదేళ్ల పాటు స్టోర్ చేసుకోవచ్చని పేర్కొంది. నాణేల రూపంలోనూ కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల వద్దకు గోల్డ్ ను డెలివరీ చేస్తారు. ఎంఎంటీసీ-పీఏఎంపీకి తిరిగి ఆన్ లైన్ లోనూ ఈ గోల్డ్ ను అమ్ముకోవచ్చట.
కొనుక్కోవచ్చు.. విక్రయించవచ్చు
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ ‘భారతీయులు బంగారాన్ని కేవలం మదుపుగా మాత్రమే పరిగణిస్తారు. డిజిటల్ గోల్డ్ ద్వారా పెట్టుబడుల పెట్టేందుకు మా వినియోగదారులకు సులభ మార్గాన్ని తీసుకొచ్చాం. దీని ద్వారా మా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.. లేదా విక్రయించుకోవచ్చు. అతి తక్కువగా రూపాయికి కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు' అని చెప్పారు.