ట్రిపుల్ తలాక్ బిల్లు: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బిల్లు రూపకల్పన ఇలా
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ చర్చనీయాంశంగా మారింది. గత గురువారం లోకసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. రాజ్యసభలో ఆమోదం అంత సులువు కాదు. రాజ్యసభలో విపక్షాలదే మెజార్టీ కావడంతో తలాక్ బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మిగతా పక్షాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ సొంతగా బిల్లులో కొన్ని మార్పులను సూచించింది. మార్పులకు ప్రభుత్వం అంగీకరించకుంటే సెలక్ట్ కమిటీని వేయాలని డిమాండును తెరపైకి తేనున్నది. వివాహాలకు సంబంధించినవి సివిల్ వివాదాలు కాగా, బీజేపీ తీసుకు వచ్చిన బిల్లుతో వాటిని క్రిమినల్ వివాధాలుగా మార్చేసిందన్న సిపిఎం వాదనతో ఏకీభవిస్తున్నట్లు కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కాంగ్రెస్ తీసుకోబోయే నిర్ణయం ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు తమిళనాడులో ముఖ్య పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు సెలక్ట్ కమిటీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు, ఇది ముస్లీం మహిళా సోదరీమణుల సమాత్వం కోసమని చెబుతోంది. ట్రిపుల్ తలాక్ పైన కాంగ్రెస్ కన్ఫూజన్లో ఉందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ విమర్శించారు. మరోవైపు ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏం చేయాలనే దానిపై విపక్షాలు మంగళవారం ఉదయం భేటీ అయ్యాయి.
ట్రిపుల్ తలాక్: ఎంపీలకు బీజేపీ విప్, ప్రశంసించిన ములాయం కోడలు
కొన్ని దశాబ్దాలుగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. సుప్రీం ఆదేశాలతో ట్రిపుల్ తలాక్కు చరమగీతం పాడేలా కేంద్రం ఈ బిల్లు రూపొందించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకల్పన జరిగింది.
ట్రిపుల్ తలాక్ చెల్లదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగకరమని సుప్రీం స్పష్టం చేసింది. ఆరునెలల్లో చట్టం తేవాలని గత ఆగస్టులో కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
తలాక్ చెప్పి విడాకులు తీసుకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, గరిష్ఠంగా మూడేళ్లు జైలుశిక్ష విధిస్తామని ఈ బిల్లులో కేంద్రం పొందుపర్చింది. ట్రిపుల్ తలాక్ మహిళల హక్కులను హరిస్తోందని గత ఆగస్టు 22న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీనిపై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించడంతో తీసుకు వచ్చింది.ఆదేశించింది.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ట్రిపుల్ తలాక్పై ముసాయిదా బిల్లును తయారు చేసింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర సహాయమంత్రి పీపీ చౌదరిలు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
కేంద్రం రూపొందించిన ఈ చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందిన బాధితులు ఫిర్యాదు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి అధికారం ఉంటుంది. అలాగే మైనర్ పిల్లలు ఉంటే వారి సంరక్షణ బాధ్యత కూడా భర్తే భరించాల్సి ఉంటుంది. నోటి మాట, లిఖిత పూర్వకంగా, వాట్సాప్, ఎస్సెమ్మెస్, ఈ మెయిల్ ద్వారా తలాక్ చెప్పడం నిషేధం.
సుప్రీం ఆదేశాలతో ముసాయిదా బిల్లును రూపొందించిన కేంద్రం దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని డిసెంబరు 1న రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. డిసెంబరు 10లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.
కేంద్రం పంపిన ముసాయిదా బిల్లుకు అసోం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లు మద్దతు తెలుపుతూ అసెంబ్లీ తీర్మానాలు పంపాయి. ముసాయిదా బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపగా, గత గురువారం లోకసభ ఆమోదించింది. ఇక రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.