బిలియనీర్ రామలింగరాజు రోజు ఆర్జన రూ.50, జైల్లో ఏం పని?
హైదరాబాద్: ఒకప్పుడు బిలియనీర్ అయిన సత్యం రామలింగ రాజు ఇప్పుడు రోజుకు యాభై రూపాయలు సంపాదించనున్నాడు! సత్యం కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పదిమందికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో రామలింగ రాజును జైలుకు తరలించారు.
జైలులో రామలింగ రాజు రోజుకు రూ.50 సంపాదించనున్నాడు. అయితే, ఆ మొత్తాన్ని అతను తన కోసం వినియోగించుకోవద్దు.
జైలు నియమ నిబంధనల ప్రకారం.. ఖైదీ నెంబర్ 4148 (రామలింగ రాజు ఖైదీ నెంబర్) రోజు తాను ఆర్జించిన మొత్తంలో (రూ.50)లో సగం తన ఖర్చు కోసం వినియోగించుకోవచ్చు. అంటే రూ.25 రూపాయలను సబ్బులు, టూత్ పేస్ట్, బిస్కట్స్, బ్రెడ్, వాటర్ బాటిల్ తదితరాలను కొనుక్కునేందుకు ఉపయోగించవచ్చు.
మిగిలిన మొత్తాన్ని ఖైదీకి జైలు అధికారులు తెరిచే అకౌంటులో జమ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని సదరు ఖైదీ విడుదలయ్యేటప్పుడు ఇస్తారు. కాగా, రామలింగ రాజుకు జైలు అధికారులు ఏం పని ఇస్తారో తెలియాల్సి ఉంది.
రామలింగ రాజుకు ఏం పని అప్పగించాలనే విషయమై జైలు అధికారులు చర్చిస్తాన్నారని సమాచారం. రామలింగ రాజుకు ఏం పని అప్పగించాలనే విషయమై చూస్తున్నామని, తమ ముందు ప్రస్తుతం మూడు ఆప్షన్స్ ఉన్నాయని జైలు అధికారులు చెబుతున్నారు.
రామలింగ రాజును లైబ్రరీలో ఉంచడం లేదా నిర్వహణ అసిస్టెంట్ లేదా అండల్ట్ ఎడ్యూకేషన్ ప్రోగ్రాంలలో దేనికి సరిపోతారని భావిస్తే ఆ పని అప్పగిస్తామని చెప్పారు. అలాకాకపోయినా చదువు రానివారికి చదువు చెప్పించే విషయమై కూడా ఆలోచిస్తామన్నారు. రామలింగ రాజుకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నందున ఖైదీలకు దానిపై అవగాహన కల్పించేందుకు చూస్తామన్నారు.