కేరళను పక్కనపెట్టిన కేంద్రం.. రెండోసారీ వరద సహాయానికి నిరాకరణ.. ఏడు రాష్ట్రాలకు 6వేల కోట్లు..
భారీ వదరలు ముంచెత్తడంతో అన్ని రకాలుగా నష్టపోయిన రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్(ఎన్డీఆర్ఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడు రాష్ట్రాలకు గానూ సుమారు 6వేల కోట్లిచ్చిన కేంద్రం.. కేరళకు మాత్రం సహాయం చేయడానికి నిరాకరించింది. కేరళలో వరుసగా రెండేళ్లు( 2018, 2019) భారీ వరదలు సంభవించినా సహాయ నిధి దక్కకపోవడం చర్చనీయాంశమైంది.
డిసైడ్ చేసింది అమిత్ షానే..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని హైలెవల్ కమిటీ.. వరద సహాయ నిధి ఏయే రాష్ట్రాలకు ఇవ్వాలనేదానిపై చర్చించి, జాబితా రూపొందించింది. సాయం ప్రకటించిన ఏడు రాష్ట్రాల్లో ఐదు(కర్నాటక, త్రిపుర, అస్సాం, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్) బీజేపీ పాలిత రాష్ట్రాలకే కావడం గమనార్హం.
వాటితోపాటు శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రకు, కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్ కు మాత్రమే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ దక్కనుంది. కేంద్ర హోం శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వరద సహాయంగా మధ్యప్రదేశ్ కు సుమారు 1749 కోట్లు, మహారాష్ట్రకు 354 కోట్లు, అస్సాంకు 616 కోట్లు, హిమాచల్ కు 284 కోట్లు, త్రిపురకు 63 కోట్లు, ఉత్తరప్రదేశ్ కు 367 కోట్లు, కర్నాటకకు గరిష్టంగా 1869 కోట్లు కేటాయించారు.
రాజకీయ కారణాల వల్లేనా?
గతంలో మధ్యంతర సహాయం ప్రకటించినప్పుడుగానీ, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్న నిధులుగానీ కేరళకు దక్కకపోవడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండు సంవత్సరాలు వరదల తాకిడికి తీవ్రంగా నష్టపోయిన కేరళను కేంద్రం చిన్నచూపుచూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీపీఎం ఆధ్వర్యంలోని కేరళ ప్రభుత్వం తొలి నుంచీ కేంద్రంతో కయ్యానికి దిగుతుండటం, ఇటీవల కేంద్రం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయడం తదితర రాజకీయ కారణాల వల్లే వరద సహాయం దక్కలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. కేరళకు సహాయ నిధి ఎందుకు ఇవ్వలేదనేదానిపై కేంద్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.