పని మీద చెన్నై వెళ్లా..గుండెనొప్పితో ముంబై ఆసుపత్రిలో చేరా: కాంగ్రెస్ ఎమ్మెల్యే
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం సంకట స్థితిని ఎదుర్కొంటోంది. బలపరీక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో- కాంగ్రెస్కు చెందిన కగ్వాడ ఎమ్మెల్యే శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ అదృశ్యం కావడం సంచలనాన్ని రేపింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం తొలిరోజైన గురువారం నాడు బలపరీక్ష నుంచి విజయవంతంగా బయటపడటానికి ఈ అదృశ్యం ఉదంతమే కాపాడింది. బుధవారం రాత్రి బెంగళూరు శివార్లలోని దేవనహళ్లిలో గల విండ్ఫ్లవర్ ప్రకృతి రిసార్ట్స్ నుంచి మాయమైన ఆయన గురువారం తెల్లవారే సరికి ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించారు.
భారతీయ జనతాపార్టీ ఆయనను కిడ్నాప్ చేసిందంటూ కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు తొలిరోజు శాసనసభలో హైడ్రామాను నడిపించారు. సభను వాయిదా వేయించారు. తమ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కిడ్నాప్ కావడానికి బీజేపీ కారణమని అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఏకంగా బెంగళూరు నగర పోలీస్ కమిషనర్కే వారు ఫిర్యాదు చేశారు. ఒకవంక- ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను ప్రదర్శిస్తూ, ఆ ఈ పరిస్థితికి చేరుకోవడినికి ప్రధాన కారణం బీజేపీయేనంటూ సభలో గందరగోళాన్ని సృష్టించారు.
ఇదిలావుండగా- ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీమంత్ పాటిల్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఓ అత్యవసర పని కోసం తాను బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లానని, ఆ సమయంలో గుండెనొప్పికి గురయ్యానని వివరించారు. చెన్నై ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్న అనంతరం తాను ముంబైకి వెళ్లిపోయానని అన్నారు. ముంబైలో తాను తరచూ గుండె పరీక్ష చేయించుకునే ఆసుపత్రిలో ప్రస్తుతం చేరానని చెప్పారు. తన ఆరోగ్యం కుదుటపడగానే బెంగళూరుకు వస్తానని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.