నాడు జగన్... నేడు సింధియా: ఢిల్లీని ఢీకొట్టి కాంగ్రెస్ పని ఖతం చేశారు..హస్తం కోలుకోవడం కష్టమే..!
కాంగ్రెస్కు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమంతా క్రమంగా పడిపోతోంది. ఒకే ఒక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తుండటంతో ఏకంగా ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైయస్ మరణాంతరం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అప్పటి వరకు ఒకే తాటిపైన ఉన్న కాంగ్రెస్లో చీలికలు ప్రారంభమయ్యాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎపిసోడ్ కూడా ఇదే తలపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి నిన్ననే జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా.. బీజేపీలో చేరిక..? కేంద్రమంత్రి పదవీ..?
సిందియా ఎగ్జిట్తో కాంగ్రెస్ ఎగ్జిట్
బీజేపీ ఆధిపత్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ అరకొర మెజార్టీతో గెలిచి ప్రభుత్వం స్థాపించింది. ప్రభుత్వం అయితే స్థాపించింది కానీ అక్కడ ముఖ్యమంత్రికి నిత్యం నిప్పుల కుంపటిపైనే ఉన్నట్లు ఉండేది పరిస్థితి. ఎప్పుడు ఎవరు పార్టీ మారి ప్రభుత్వాన్ని పడగొడుతారో అనే భయం నిత్యం వెంటాడుతూ ఉంటుంది. తాజాగా మధ్యప్రదేశ్ పరిస్థితి చూస్తే ఇక కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.
అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్దర పట్టకుండా చేసిన ఒకే ఒక్క వ్యక్తి జ్యోతిరాదిత్య సింధియా. కమలం పార్టీ గురి తప్పకుండా విసిరిన బాణానికి జ్యోతిరాదిత్య కమల్నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఫలితంగా అక్కడి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతకమల్నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.
అలకపాన్పు ఎక్కిన సింధియా... ప్రాధాన్యత లేదంటూ..
ఇక కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కాదు. ఈ మధ్యకాలంలోనే కర్నాటకలో బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా కూల్చిందో చూశాం. కర్నాటక కాంగ్రెస్ మరియు జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వేసిన వలలో చిక్కుకుని ఆ ప్రభుత్వం పడిపోయేందుకు కారణమయ్యారు. ఫలితంగా అందులో కొందరికి యడియూరప్ప కేబినెట్లో చోటు దక్కింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఇదే జరగబోతున్నట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో 18 ఏళ్లుగా ఉన్న తనకు ప్రాధాన్యత తగ్గిందంటూ అందుకే పార్టీని వీడాలని భావిస్తున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు జ్యోతిరాదిత్య సింధియా. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా జోతిరాదిత్య సింధియాకు సరైన అండలేకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీని వీడారు. వెళుతూ వెళుతూ అతని వర్గం ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్లడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది.
జగన్కు నాడు ఇదే పరిస్థితి
గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ మరణాంతరం కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఒక వర్గం జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారయ్యాయి. ఇక ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో జగన్కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ ఆదేశాలను జవదాటరాదంటూ తీవ్రంగా హెచ్చరించింది.
సోనియాగాంధీని కలిసి తన సమస్య చెప్పుకుందామని నాడు జగన్ కుటుంబం ప్రయత్నించగా అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో జగన్ పార్టీని వీడుతూ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వెంటనే కొత్త పార్టీ పెట్టి 2014లో కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేశారు. ఇక అదే పరిస్థితి 2019లో కూడా కాంగ్రెస్కు ఎదురైంది.
మొత్తానికి కాంగ్రెస్కు అండగా ఉన్న బలమైన నాయకులు, నాయకుల వర్గం క్రమంగా ఆ పార్టీని వీడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయే స్థాయికి దిగజారింది. ఇది ఇలానే కొనసాగితే కాషాయదళం నేతల వ్యూహాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.