షాక్: ఒకప్పటి జాతీయ ఆర్చరీ చాంపియన్.. నేడు నారింజ పళ్లు అమ్ముకుంటూ..
ఒకప్పుడు ఆమె జాతీయ ఆర్చరీ ఛాంపియన్. ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. అయితే ఓడలు.. బండ్లు అయినట్లు.. ఆమె పరిస్థితి కూడా తలకిందులైంది. వీధులెంట తిరుగుతూ నారింజ పళ్లు అమ్మడం ప్రారంభించింది.
గౌహతి: ఒకప్పుడు ఆమె జాతీయ ఆర్చరీ ఛాంపియన్. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. అయితే ఓడలు.. బండ్లు అయినట్లు.. ఆమె పరిస్థితి కూడా తలకిందులైంది.
దిగజారిన ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం కారణంగా ఆటలో కొనసాగలేక విల్లు వదిలేసింది. చివరికి కుటుంబ పోషణ కోసం వీధులెంట తిరుగుతూ నారింజ పళ్లు అమ్మడం ప్రారంభించింది.
ఇది అసోం బోడో తెగకు చెందిన బులి బసుమాత్రి కథ. 2003లో సాయ్ ప్రతిభాన్వేషణలో తొలిసారి వెలుగులోకి వచ్చిన బసుమాత్రి.. ఏ టోర్నీకి వెళ్లినా పతకంతో తిరిగొచ్చేది. 2005లో అజ్మీర్ లో ఆడిన తొలి సబ్ జూనియర్ చాంపియన్ షిప్ లో రెండు స్వర్ణాలు, రజతం గెలిచి తన సత్తా ఏమిటో చాటి చెప్పింది.
2006 అమరావతిలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ, రజత పతకాలు గెలిచిన బసుమాత్రి.. అదే ఏడాది ఔరంగాబాద్ ఛాంపియన్ షిప్ లో కూడా రజతం సాధించింది. ఆ తరువాతి ఏడాది ఝార్కండ్ లో జరిగిన సీనియర్ ఛాంపియన్ షిప్ లోనూ స్వర్ణ పతకం గెలిచింది.
ఆర్చరీలో మంచి ఫామ్ లో ఉండి.. వరుస పతకాలు గెలుస్తున్న బసుమాత్రిని విధి వెక్కిరించింది. ఒకవైపు ఇంటి ఆర్థిక పరిస్థితులు క్షీణించడం, మరోవైపు అనారోగ్యం పట్టి పీడించడంతో ఆమె ఆటపై శ్రద్ధ చూపలేకపోయింది.
అలా ఏడేళ్లపాటు విలువిద్యకు దూరమై ఏ పోటీలోనూ పాల్గొనలేకపోయింది. బసుమాత్రికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చివరికి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వీధులెంట తిరిగి నారింజపళ్లు కూడా అమ్మింది. భూటాన్ నుంచి నారింజపళ్లు తీసుకొచ్చి అసోంలోని చిరాంగ్ జిల్లాలో ఉన్న ఓ మార్కెట్ వద్ద అమ్ముకుంటోంది.
ఆదుకుంటామన్న ప్రభుత్వం...
ఆర్చరీలో ఒకప్పటి జాతీయ ఛాంపియన్ అయిన బసుమాత్రి దీనగాధ ఇటీవల ప్రభుత్వం దృష్టికి వచ్చింది. క్రీడా శాఖ మంత్రి ఆమెను అసోం ఆర్చరీ జట్టుకు కోచ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
దీనిపై బసుమాత్రి మాట్లాడుతూ.. ''ఇకపై నేను నారింజకాయలు అమ్మనక్కర్లేదు. మళ్లీ ఆర్చరీలోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. కోచ్ ఉద్యోగం ఇస్తామని క్రీడామంత్రి హామీ ఇచ్చారు. అకాడమీ పిల్లలనే కాదు, నా ఇద్దరు కుమార్తెలను కూడా ఆర్చరీ ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతూ..'' అని ఆశాభావం వ్యక్తం చేసింది.