ప్రధాని అమెరికా యాత్ర-ఆఫ్గాన్ రూట్ క్లోజ్ : పాకిస్థాన్ మీదుగా మోదీ విమానం-గతంలో తిరస్కరించినా..!!
ప్రధాని అమెరికా పర్యటనకు బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్తున్నట్లుగా ట్వీట్ చేసిన ప్రధాని..వ్యూహాత్మక బంధాల బలోపేతం కోసం తన పర్యటన సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రధాని ఈ పర్యటనలో ముందుగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తోనూ భేటీ కానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్లు మోదీ తెలిపారు.
ఇక, అమెరికా అధ్యక్ష బాధ్యతలు బైడెన్ చేపట్టిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 24న అధ్యక్షుడు బైడెన్ తో కీలక భేటీ జరగనుంది. ద్వైపాక్షిక అంశాల పైన ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇక, ఈనెల 25న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తారు. అయితే, ప్రధాని అమెరికా పర్యటనకు బయల్దేరిన వెంటనే ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ రూట్లో మోదీ ప్రయాణించే విమానం వెళ్లడం లేదని అధికారులు చెప్పారు. ప్రధాని విమానం తమ మార్గం ద్వారా వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి లభించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో కమర్షియల్ ఫ్లయిట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో.. పాకిస్థాన్ వాయుమార్గం ద్వారా ప్రధాని మోదీ విమానం అమెరికా కు వెళ్లింది. పాకిస్థాన్ ఆకాశమార్గాన్ని వాడుకునేందుకు భారతీయ అధికారులు ముందుగా ఆ దేశం నుంచి అనుమతి తీసుకున్నారు. ఇస్లామాబాద్లోని అధికారులు మోదీ విమాన ప్రయాణానికి పచ్చజెండా ఊపారు.
అయితే 2019 సంవత్సరంలో మోదీ విమానానికి పాకిస్థాన్ అనుమతి ఇవ్వలేదు. జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆ ఆంక్షలు విధించారు. మోదీ, రాష్ట్రపతి కోవింద్ల విమానాలను పాక్ ఎయిర్స్పేస్ మీదుగా వెళ్లనివ్వలేదు. కానీ ఈ ఏడాది శ్రీలంక వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ విమానానికి భారత్ తమ వాయుమార్గాన్ని వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రధాని మోదీ ఇవాళ బోయింగ్-777 విమానంలో అమెరికా వెళ్లారు. ఆ విమానాన్ని ఇటీవలే మాడిఫై చేశారు.
దాంట్లో అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇండియా నుంచి అమెరికాకు బీ-777 నాన్ స్టాప్ విమాన ప్రయాణానికి 15 గంటల సమయం పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ వాయుమార్గాన్ని వాడకపోవడం వల్ల.. అదనంగా మరికొన్ని గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని అమెరికా టీంలో ఎన్ఎస్ఏ సలహాదారుడు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగాల్, ఇతర ప్రభుత్వ అధికారులు ఉన్నారు.