ఒకప్పుడు 2-3 స్థానాల్లో... ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీ.. ఆ సైలెంట్ ఓటర్లు ఎప్పుడూ మా వెంటే
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు,దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికలపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీని గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్పట్లేదని... ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొని ఎన్నికలను శాంతియుతంగా సఫలం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. ఎన్నికలు దేశంలోని కొన్ని స్థానాల్లో మాత్రమే జరిగినప్పటికీ... దేశ ప్రజలంతా ఉదయం నుంచి రాత్రి వరకు టీవీలకు,సెల్ఫోన్లకు,వెబ్సైట్లకు అతుక్కుపోయి ఫలితాల కోసం ఎదురుచూశారన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
దేశం నలమూలలా బీజేపీ...
గతంలో బీహార్లో ఎన్నికలు జరిగితే.. హింస,మరణాలు,లూటీలకు సంబంధించిన వార్తలు మరుసటిరోజు పత్రికల్లో కనిపించేవన్నారు. కానీ ఇప్పుడు బీహార్లో ఓటింగ్ పెరిగిందని... మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాలు పంచుకున్నారని వార్తలు వస్తున్నాయన్నారు. గత లోక్సభ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ తాము సుపరిపాలన అందిస్తూ వచ్చామని ఈ ఎన్నికల ద్వారా వెల్లడైందన్నారు. ఒకప్పుడు కేవలం 2-3 స్థానాలకే పరిమితమైన బీజేపీ... ఇప్పుడు దేశం నలుమూలలా విస్తరించిందన్నారు. ప్రతీ ఒక్కరి మనసులోనూ చోటు సంపాదించుకుందన్నారు.
కరోనా క్లిష్ట సమయంలోనూ...
తాజా ఎన్నికల్లో విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అభినందించారు. చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలియజేశారు. కరోనా సంక్లిష్ట సమయంలోనూ ఎన్నికలను విజయవంతం చేసినందుకు... ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలు మన ప్రజాస్వామ్య బలాన్ని చాటి చెప్పాయన్నారు. ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా అభివృద్దికే ఓటేశారని చెప్పారు. కేవలం బీజేపీ మాత్రమే అన్ని వర్గాల అవసరాలను గుర్తించి... వారికి అండగా నిలబడుతోందన్నారు.
ఒక్క బీజేపీ మాత్రమే...
ఇవాళ బీజేపీ పట్ల యువకులంతా చాలా నమ్మకంతో ఉన్నారని.. దళితులు,బీసీలు,ప్రతీ వర్గం బీజేపీని విశ్వసిస్తోందని చెప్పారు. ఒక్క బీజేపీ మాత్రమే పేదలు,మహిళల కోసం పనిచేస్తోందన్నారు. బీహార్లో మూడుసార్లు అధికారం చేపట్టిన పార్టీ బీజేపీనే అని చెప్పారు.తాజా బీహార్ ఎన్నికల్లో ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని చెప్పారు. నితీశ్ నాయకత్వంలో బీహార్లో మరింత అభివృద్ది సాధిస్తామన్నారు. బీజేపీకి స్థిరమైన సైలెంట్ ఓటర్లు ఉన్నారని... వాళ్లు మహిళా ఓటర్లు అని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ మహిళలు తమవెంటే నిలుస్తున్నారని చెప్పారు. జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటివరకూ కరోనా మహమ్మారిపై చేస్తూ వచ్చిన పోరు ఎన్నికల్లో ప్రతిఫలించిందన్నారు. కోవిడ్ 19 నుంచి రక్షించబడ్డ ప్రతీ ప్రాణం ఒక విజయగాథే అన్నారు.