షారుక్ కోసం ఎగబడిన అభిమానులు: ఒకరు మృతి, మరొకరి తీవ్రగాయాలు, తోపులాట
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తన సినిమా రాయీస్ ప్రమోషన్ కోసం ఢిల్లీకి వెళుతున్న సమయంలో వడోదరా రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది.
ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తన సినిమా రాయీస్ ప్రమోషన్ కోసం ఢిల్లీకి వెళుతున్న సమయంలో వడోదరా రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆగస్ట్ క్రాంతి ఎక్స్ప్రెస్లో వెళుతున్న షారుక్.. వడోదరా రైల్వేస్టేషన్లో కొద్ది క్షణాలపాటు ఆగారు.
షారుక్, రాయీస్ చిత్ర బృందంతో కలిసి ఆయన కొద్ది సేపు అక్కడే గడిపారు. తన చిత్రం జనవరి 25న విడుదలవుతోందని, అందరూ చూడాలని లౌడ్ స్పీకర్ ద్వారా ఆయన అభిమానులను కోరారు. ఫరీదా ఖాన్ షెరానీ అనే ఓ అభిమాని తన భార్య, పిల్లలతో కలిసి షారుక్తో ఫొటో దిగేందుకు వచ్చారు.
అదే సమయంలో షారుక్ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే షారుక్ ఎక్కిన రైలు అక్కడ్నుంచి బయల్దేరింది. ఈ క్రమం అతడ్ని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన షెరానీని సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.
కానీ, అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మరో మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇది ఇలా ఉండగా, రైల్వే స్టేషన్లో పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి చేరుకున్న అభిమానులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కిందపడిపోవడంతో వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
షారుక్ ఖాన్.. తన చిత్ర ప్రమోషన్ కోసం ముంబై నుంచి ఢిల్లీకి వెళుతున్నానని, వడోదరాలో కొద్ది సేపు ఆగుతానని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వడోదరా స్టేషన్ కు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. కాగా, క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్లు వడోదరాకు షారుక్ చేరుకోవడంతో.. ఆయనను రైల్లోనే కలిశారు. అక్కడ దిగిన ఫొటోలను వారు సోషల్ మీడియా
ద్వారా పంచుకున్నారు.షారుక్ విచారం
'రాయీస్' సినిమా ప్రచారం సందర్భంగా వడోదర రైల్వే స్టేషన్లో అభిమాని మృతి చెందటంపై షారుక్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. 'అక్కడ మా బృందాలు ఉన్నాయి.. భద్రతా సిబ్బంది ఉన్నారు.. అయినా అటువంటి ఘటన జరగటం విచారకరం' అని షారుక్ అన్నారు.