ఒకరు భారతీయులు: సిడ్నీపై వెంకయ్య, బందీల్లో గుంటూరు ఇన్ఫోసిస్ టెక్కీ
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా సిడ్నీ గల కేఫ్లో అగంతకుల చేతిలో చిక్కుకున్న బందీల్లో భారత దేశానికి చెందిన ఒకరు ఉన్నట్లుగా సమాచారం అందుతోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం పార్లమెంటు బయట సోమవారం చెప్పారు. ఇండియన్ ఎంబసీతో టచ్లో ఉన్నట్లు చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నామన్నారు.
సిడ్నీలోని ఇండియన్ కాన్సులేట్ ఖాళీ చేశామని వెంకయ్య చెప్పారు. ఇండియన్ కాన్సులేట్కు చెందిన సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. కాగా, ఆ బందీ సాఫ్టువేర్ ఇంజనీర్గా చెబుతున్నారు.
అగంతకులు బందీగా ఉంచిన సంఘటన ప్రాంతానికి ఇండియన్ ఎంబసీ మూడు నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉందని, ఈ కారణంగా ఖాళీ చేసినట్లు సంబంధిత మంత్రి అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. భారత్ కాన్సులేట్ అక్కడి స్థానిక అధికారులతో టచ్లో ఉందని ఆయన చెప్పారు. అలాగే సిబ్బంది క్షేమంగా ఉందన్నారు.
ఇలాంటి సంఘటనలు హ్యాండిల్ చేయడం కష్టతరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాము హెల్ప్ లైన్ను, డిప్యూటీ కౌన్సెల్ జనరల్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఎవరికైనా సమాచారం కావాలంటే తాము ఇస్తామని ఆయన తెలిపారు.
ట్విట్టర్లో జైట్లీ
సిడ్నీ ఘటన అత్యంత హేయమైనదని, అగంతకుడి చెరలో ఉన్న బందీలు క్షేమంగా బయటపడాలని ప్రార్థిద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఉగ్రవాదుల చెరలో ఉన్నది గుంటూరు వాసి
ఆస్ట్రేలియా సిడ్నీలోని ఉగ్రవాది చెరలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు వాసి అని తెలిసింది. గుంటూరు జిల్లాకు చెందిన విశ్వకాంత్ అంకిరెడ్డి ఉగ్రవాది చెరలో ఉన్నారు. ఆయనది జిల్లాలోని పిడుగురాళ్ల మండలం గంగిరెడ్డిపల్లి. విశ్వకాంత్ ఇన్ఫోసిస్ సంస్థలో పని చేస్తున్నారు.