సిడ్నీ బందీల్లో తెలుగు టెక్కీ: ఎవరీ విశ్వకాంత్? ప్రధానితో మాట్లాడుతానని, భారీ కుట్రనా?
హైదరాబాద్: ఆస్ట్రేలియా సిడ్నీలోని కేఫ్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది చేతుల్లో బందీలైన వ్యక్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ ఉన్న విషయం తెలిసిందే. బందీల్లో తమ సంస్థకు చెందిన టెక్కీ ఉన్నట్లుగా ఇన్ఫోసిస్ కూడా సోమవారం ధృవీకరించింది.
సిడ్నీలోని ఉగ్రవాది చెరలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు వాసి. గుంటూరు జిల్లాకు చెందిన విశ్వకాంత్ అంకిరెడ్డి ఉగ్రవాది చెరలో ఉన్నారు. ఆయనది జిల్లాలోని పిడుగురాళ్ల మండలం గంగిరెడ్డిపల్లి. విశ్వకాంత్ హైదరాబాదులోని ఇన్ఫోసిస్ సంస్థలో పని చేస్తున్నారు.
చిన్నప్పుడు అతను కోరుకొండ సైనిక్ పాఠశాలలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అతని పైన జిల్లా అధికారులు పూర్తి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, అంకిరెడ్డి బందీగా ఉన్న నేపథ్యంలో తాము స్థానిక అధికారులతో తాము టచ్లో ఉన్నట్లు ఇండియన్ కాన్సులేట్ చెప్పింది.
ఆప్ఘన్కు చెందిన గన్మెనా? ప్రధానితో మాట్లాడుతానని డిమాండ్...
సామాన్యులను బంధించింది ఎవరో ఇప్పటి వరకు గుర్తించలేదని తెలుస్తోంది. అయితే, అతను మాత్రం ఆప్ఘన్కు చెందిన వాడు అయి ఉంటారని భావిస్తున్నారు. నిందితులను బందించిన గన్మెన్ ఆస్ట్రేలియా ప్రధానితో మాట్లాడలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తనకు ఐఎస్ జెండా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు. సిడ్నీ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు.
భారీ విధ్వంసానికి కుట్ర
భారీ విధ్వంసానికి ఇస్లామిక్ తీవ్రవాదులు కుట్ర పన్నినట్లుగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అగంతకుల చెరలో ఉన్న బందీలను సురక్షితంగా తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా, అతనిని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.