రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ, 14 రోజుల కస్టడీ విధింపు
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా సోదరుడు రామ్ భరత్ను బుధవారం ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. రామ్ భరత్ను ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద్ అరెస్టు చేసి హరిద్వార్లోని పత్రి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హరిద్వార్లోని పతంజలి హెర్బల్ ఫుడ్ పార్క్లో బుధవారం ఫుడ్ పార్క్ ఉత్పత్తులు తరలించే హరిద్వార్ ట్రక్కు యూనియన్, రాందేవ్ బాబా గార్డుల మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గత కొంతకాలంగా పతంజలి ఉత్పత్తులను భారత్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ వాహనాదారులను నియమించుకుని పతంజలి యోగపీఠం తరలిస్తుంది. ఇలా చేయడం ఏ మాత్రం నచ్చని హరిద్వార్ ట్రక్కు యూనియన్ సిబ్బంది తమతో ట్రాన్స్పోర్ట్ చేయించడం లేదని పుడ్ పార్క్ సిబ్బందితో గొడవకు దిగారు.
ఈ ఘటనకు సంబంధించి రాందేవ్ బాబా సోదరుడు రామ్ భరత్ ట్రాన్స్పోర్టు సిబ్బందితో చర్చిస్తున్న సమయంలో, ట్రక్కు యూనియన్ సిబ్బందికి పుడ్ పార్క్ సిబ్బందితో మాటామాటా పెరిగి ఇరు వర్గాలు తుపాకీతో కాల్పులు జరుపుకున్నారు.
ఈ ఘటనలో ట్రక్కు యూనియన్ నాయకుడు దల్జీత్ చనిపోగా, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రామ్ భరత్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగాదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాందేవ్ సోదరుడికి బెయిల్ నిరాకరణ
యోగా గురు రాందేవ్ బాబా సోదరుడు రామ్ భరత్కు హరిద్వార్లోని స్ధానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు, అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.