పంజాబ్కు పాకిన పోలింగ్ హింస: ఒకరి హత్య..పోలీసుల ఫైరింగ్!
భటిండా: పశ్చిమ బెంగాల్కే పరిమితమైందనుకున్న పోలింగ్ హింస.. పంజాబ్ వరకూ పాకింది. పంజాబ్లో మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఆదివారం మధ్యాహ్నం పోలింగ్ హింస చెలరేగింది. పోలీసులు కాల్పులు జరిపేంత వరకూ వెళ్లింది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త ఒకరు రాజకీయ ప్రత్యర్థుల చేతుల్లో దారుణహత్యకు గురి కావడం వల్ల హింస చెలరేగినట్లు తెలుస్తోంది.
ఓటు వేసిన బిహారీ వీణా-వాణి: శరీరం ఒక్కటే: ఓట్లు వేర్వేరు!
ఖడూర్ సాహిబ్, భటిండా, ఫిరోజ్పూర్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో హింస చెలరేగింది. ఖడూర్ సాహిబ్ నియోజకవర్గం పరిధిలోని హర్దో సార్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త దారుణహత్యకు గురయ్యారు. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన గ్రామం నుంచి సైకిల్పై పోలింగ్ కేంద్రానికి బయలుదేరిన ఆయనను మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనితో- ఆ పార్టీకి చెందిన కార్యకర్తులు పెద్ద ఎత్తున రెచ్చిపోయారు. విధ్వంసానికి దిగారు.
భటిండా లోక్సభ పరిధిలోని రామ్పురా ఫూల్ సిటీ పరిధిలో కూడా అల్లర్లు చెలరేగాయి. అకాలీదళ్ కార్యకర్తలు తమ రాజకీయ ప్రత్యర్థులపై జరిపిన దాడుల్లో ఓ వ్యక్తి గాయపడ్డారు. భటిండా జిల్లాలోని తల్వాండి సబో ప్రాంతంలో అల్లరి మూకలను చెదర గొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో శిరోమణి అకాలీదళ్కు చెందిన ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు.
హింసాత్మక పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో పోలింగ్ను నిలిపి వేశారు ఎన్నికల అధికారులు. ఫిరోద్కోట్ లోక్సభ పరిధిలో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. పంజాబ్ మాజీ మంత్రి సికందర్ సింగ్ మలూకా ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు దిగారు. రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.