శబరిమలలో మరో మహిళ..? వృద్దురాలి వేషం.. అయ్యప్ప దర్శనం...!
తిరువనంతపురం : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శబరిమల అయ్యప్ప సన్నిధిలోకి మహిళల ప్రవేశం రసాభాసాగా మారింది. అయ్యప్ప భక్తుల ఆందోళన నడుమ ఇప్పటికే కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. ఈక్రమంలో అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అయితే మంజు అనే 36 ఏళ్ల మహిళ.. తాను వృద్ధురాలి వేషంలో అయ్యప్పను దర్శనం చేసుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.
తలకు తెల్లరంగు.. అయ్యప్ప దర్శనం
త్రిస్సూర్ నుంచి జనవరి 8న శబరిమల యాత్రకు బయల్దేరిన నాటి నుంచి అయ్యప్ప దర్శనం వరకు జరిగిన పరిణామాలను మంజు వివరించారు. ఆందోళనకారుల నుంచి తనకు ఇబ్బందులు తలెత్తకుండా వృద్ధురాలిగా నటించానని చెప్పుకొచ్చారు. ఈక్రమంలో తలకు తెల్లరంగు వేసుకున్నట్లు తెలిపారు. పెద్దవయసు స్త్రీలా కనిపించడంతో తనను ఎవరూ అడ్డుకోలేదని.. పైగా పోలీసుల సాయం లేకుండానే అయ్యప్ప దర్శనం పూర్తయినట్లు వెల్లడించారు.
గతేడాది విఫలం.. ఇప్పుడు సక్సెస్..!
దాదాపు 2 గంటల పాటు సన్నిధానంలో ఉన్నానని.. వృద్ధురాలి వేషంలో ఉండటంతో ఎలాంటి అభ్యంతరం ఎదురుకాలేదని పేర్కొన్నారు. పెద్దవయసు స్త్రీలా కనిపించేసరికి తనను గుర్తుపట్టలేదన్న మంజు.. అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు సాయం చేశారని చెప్పారు. 2018 అక్టోబరులో అయ్యప్ప ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించి విఫలమయ్యానని.. ఈసారి మాత్రం విజయవంతంగా దర్శనం పూర్తయిందని సంతోషం వ్యక్తం చేశారు.
మరో టెన్షన్..!
అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతించడంపై దుమారం రేగుతోంది. అయ్యప్ప భక్తులు అడుగడుగునా మహిళా భక్తులను అడ్డుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అంతేకాదు ఆందోళనలో భాగంగా చేపట్టిన కేరళ బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. ఇలాంటి నేపథ్యంలో వృద్ధురాలి వేషంలో అయ్యప్పను దర్శించుకున్నానంటూ మంజు అనే మహిళ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టింగ్ చర్చానీయాంశంగా మారింది.