మూడు రోజుల్లోనే లక్ష కేసులు... దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే... 6 కీలక పాయింట్స్...
శుక్రవారం(జూలై 11) నాటికి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దేశంలో 1లక్ష కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇందులో అత్యధిక కేసులు మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ నుంచే నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న పట్టణాలు,నగరాల్లో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై 10 కీలక పాయింట్స్ను ఒకసారి పరిశీలిద్దాం.
మరణాల రేటు తగ్గుదల...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ శుక్రవారం మాట్లాడుతూ... దేశంలో కోవిడ్ 19 పేషెంట్ల మరణాలు 2.72శాతం మేర తగ్గినట్లు తెలిపారు. 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ స్థాయిలో మరణాలు నమోదవుతున్నట్లు చెప్పారు. కరోనా రికవరీ రేటు 62.42శాతంగా ఉందని... 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ రికవరీ రేటు ఉందని స్పష్టం చేశారు.
పుణే,ఉత్తరప్రదేశ్లలో లాక్ డౌన్...
కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పుణే,పింప్రి-చించ్వాడ్లలో జూలై 13 నుంచి జూలై 23 వరకూ మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. కేవలం మిల్క్ షాప్స్,మెడికల్ షాప్స్క,క్లినిక్స్,అత్యవసర సర్వీసులు మాత్రమే లాక్ డౌన్ పీరియడ్లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ చైన్ను బ్రేక్ చేసేందుకు లాక్ డౌన్ ఉపయోగపడుతుందని తెలిపింది. ఇక ఉత్తరప్రదేశ్లోనూ వీకెండ్ లాక్ డౌన్ విధించారు. శుక్రవారం(జూలై 10) రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 5గంటల వరకూ 55 గంటల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ సమయంలో కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు.
చెన్నైలో మొబైల్ ఫీవర్ క్లినిక్స్
తమిళనాడులో నమోదైన కేసుల్లో ఒక్క చెన్నై నగరంలోనే 58.6శాతం కేసులు నమోదయ్యాయి. గడిచిన 16 రోజుల్లో మధురై పట్టణంలోనూ ఐదు రెట్లు కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో చేపడుతున్న ప్రత్యేక చర్యలపై కేంద్రమంత్రి హర్షవర్దన్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.సి.విజయ భాస్కర్తో మాట్లాడారు. 'చెన్నైలో 350 మొబైల్ ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. ప్రతీరోజూ చెన్నై నగరంలో 35వేల నుంచి 40వేల టెస్టులు చేస్తున్నాం. టెస్టుల సంఖ్యను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యూహాత్మక కంటైన్మెంట్ చర్యలు అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఒకింత ఆందోళన కలిగిస్తోంది.' అని విజయభాస్కర్ తెలిపారు.
ఆ 4 రాష్ట్రాల నుంచే...
దేశంలో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో 90శాతం కరోనా కేసులు తమిళనాడు,ఢిల్లీ,కర్ణాటక,తెలంగాణల నుంచే నమోదవుతున్నాయి. అలాగే 80శాతం కరోనా యాక్టివ్ కేసులు 49 జిల్లాల నుంచే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,38,461,తమిళనాడులో 1,30,261,ఢిల్లీలో 1,09,140,తెలంగాణలో 32,224 కేసులు నమోదయ్యాయి.
Recommended Video
క్వారెంటైన్లో ముఖ్యమంత్రి...
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప క్వారెంటైన్లో ఉన్నారు. సీఎం సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో కార్యాలయాన్ని మూసివేశారు. ఐదు రోజుల పాటు కార్యాలయాన్ని తెరిచేది లేదని... అధికారులు శానిటైజేషన్ చేస్తారని సిబ్బంది తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మూసివేయడం ఇది రెండోసారి. గతంలో ఓ కానిస్టేబుల్కి పాజిటివ్గా తేలిన సమయంలో నూ సీఎంవో ఆఫీస్ను మూసివేశారు.