మధ్యాహ్న భోజనం..భయానకం: ఒక లీటర్ పాలలో బకెట్ నీళ్లు..విద్యార్థులకు సరఫరా
లక్నో: గ్రామాల్లో పేద విద్యార్థుల కడుపు నింపడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మధ్యాహ్న భోజనం పథకం అమలు ఎంత దారుణంగా తయారైందో వెల్లడించే ఉదంతం ఇది. ఒక లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు పోసి, విద్యార్థులకు అందజేస్తోన్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ఉత్తర్ ప్రదేశ్ లో గిరిజనుల సంఖ్య అత్యధికంగా సోన్ భద్ర జిల్లా చోపన్ బ్లాక్ పరిధిలోని సలాయ్ బన్వా ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
#PriyankaReddy: టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజీలో చివరిసారిగా కనిపించిన ప్రియాంకా, అక్కడే స్కూటీ పార్క్
చాలా రోజులుగా అక్కడి కాంట్రాక్టర్లు ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు తేలింది. సలాయ్ బన్వా ప్రభుత్వ పాఠశాలల్లో 80 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారంతా గిరిజనులు, ఆదివాసీలు. గిరిజనుల కోసమే ప్రభుత్వం అక్కడ ఈ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారంలో భాగంగా రోజూ ఉదయం పాలను అందజేస్తారు.
పాలను సరఫరా చేసే కాంట్రాక్టును పొందిన స్థానిక రాజకీయ నాయకుడొకరు.. నిర్దేశిత సంఖ్యకు అనుగుణంగా పాలను సరఫరా చేయట్లేదు. ఒక లీటర్ పాలను మాత్రమే వారికి అందించి, అందులో బకెట్ నిండా నీళ్లును పోస్తున్నారు. ఆ పాలనే విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. తమకు రోజూ ఇలాంటి పాలనే అందజేస్తున్నారని నాలుగో తరగతి చదివే పూజా అనే విద్యార్థిని వెల్లడించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాలు లేకపోవడం వల్లే నీళ్లను కలపాల్సి వస్తోందని సంబంధిత కాంట్రాక్టర్ సమర్థించుకుంటున్నారు.
ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సమగ్ర దర్యాప్తు చేపట్టి, వెంటనే నివేదికను అందజేయాలని పాఠశాల విద్యా మంత్రిత్వ శాఖ సోన్ భద్ర జిల్లా పాలన యాంత్రాంగానికి సూచించింది. సోన్ భద్ర జిల్లా ప్రాథమిక విద్యా శాఖాధికారి గోరఖ్ నాథ్ పటేల్ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులకు పాలను మాత్రమే కాకుండా.. పౌష్టికాహారాన్ని కూడా అందజేయట్లేదని తేలిందని అన్నారు.