ఆటో డ్రైవర్ పైలెట్ అయ్యిన శుభవేళ
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కుటుంబానికి ఆసరాగా నిలవడానికి చిన్నచిన్న పనులు చేస్తూ వచ్చాడు. ఆటో నడిపాడు. అయితే అతని కల మాత్రం పైలెట్ కావాలనేది. అది సాధించాడు. తన కల నెరవేరడంతో పాటు ఇప్పుడు కుటుంబ సభ్యులను పువ్వులలో పెట్టుకుని చూసుకుంటున్నాడు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన శ్రీకాంత్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి సెక్యూరిటి గార్డుగా పని చేసేవాడు. చిన్నతనంలో చదువుకుంటూనే కుటుంబానికి సహాయం చెయ్యడానికి శ్రీకాంత్ సిద్దం అయ్యాడు. డెలివరి బాయ్ గా పని చేశాడు.
వయస్సు వచ్చిన తరువాత ఆటో నడిపాడు. ఆటో నడుపుతున్న సమయంలో ఒక టీ స్టాల్ యజమాని శ్రీకాంత్ కు పరిచయం అయ్యాడు. అప్పుడప్పుడు శ్రీకాంత్ టీ స్టాల్ దగ్గరకు వెళ్లేవాడు. ఒకసారి తాను పైలెట్ కావాలని కలలు కన్నానని, అయితే ఆటో నడుపుతున్నానని శ్రీకాంత్ టీ స్టాల్ యజమానికి చెప్పాడు.
ఆ సందర్బంలో టీ స్టాల్ యజమాని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ పేద విద్యార్థుల కోసం పైలెట్ స్కాలర్ షిప్ అందిస్తున్నారని సమాచారం ఇచ్చాడు. అంతే శ్రీకాంత్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకున్నాడు. చివరికి స్కాలర్ షిప్ సాధించాడు.
చదువులో చురుకుగా ఉండే శ్రీకాంత్ మధ్యప్రదేశ్ లోని ఫ్లైయింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. ఫ్లైయింగ్ స్కూల్ లో టాపర్ గా ఉండే వాడు. తరువాత శ్రీకాంత్ కు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ వచ్చింది. అయితే విమానయాన రంగంలో సంక్షోభం కారణంగా ఉద్యోగం కోసం వేచి చూశాడు.
కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. చివరికి శ్రీకాంత్ ఇండిగోలో పైలెట్ ఉద్యోగం సాధించాడు. శ్రీకాంత్ నేటి యువతకి ఆదర్శంగా నిలిచాడని ఇండిగో మ్యాగ్ జైన్ లో ప్రచురించింది. ట్విట్టర్ లో శ్రీకాంత్ స్పూర్తి కథనాన్ని వెల్లడించింది. టీ స్టాల్ యజమాని తన జీవితాన్ని మలుపుతిప్పాడని శ్రీకాంత్ అంటున్నారు.